అమెరికా H-1B వీసా విధానంపై విమర్శలు చేస్తూ అమెరికా రిపబ్లికన్ సెనేటర్ ఎరిక్ ష్మిట్ హైదరాబాద్లోని ప్రసిద్ధ చిల్కూర్ బాలాజీ దేవాలయాన్ని లక్ష్యంగా చేసుకోవడం వివాదానికి దారితీసింది. “వీసా టెంపుల్”గా పేరుగాంచిన ఈ ఆలయాన్ని ప్రస్తావిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి.
మిస్సౌరీకి చెందిన రిపబ్లికన్ సెనేటర్ ఎక్స్ (X) వేదికగా చేసిన పలు పోస్టుల్లో అమెరికా ఉద్యోగాధారిత వీసా వ్యవస్థపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ విధానం స్థానిక ఉద్యోగుల వేతనాలను తగ్గిస్తూ, అమెరికన్ కార్మికులను పక్కన పెట్టేలా ప్రపంచవ్యాప్తంగా ఒక “వీసా కార్టెల్”ను సృష్టిస్తోందని ఆయన ఆరోపించారు.
అమెరికాలో అమలవుతున్న H-1B, L-1, F-1 వీసాలు , OPT (Optional Practical Training) విధానాలపై ఎరిక్ ష్మిట్ విమర్శలు చేశారు. ఈ వ్యవస్థల వల్ల అమెరికన్ ఉద్యోగుల వేతనాలు తగ్గిపోతున్నాయని, స్థానిక ఉద్యోగ అవకాశాలు దెబ్బతింటున్నాయని ఆయన ఆరోపించారు.


తన X (ట్విట్టర్) పోస్టుల్లో “అమెరికన్ మధ్యతరగతిని ఈ వీసా వ్యవస్థలు బలహీనపరుస్తున్నాయి. అమెరికన్లు చెల్లించే పన్నులతో భారత్లో AI శిక్షణకు సబ్సిడీలు వెళ్తున్నాయి” అని పేర్కొన్నారు.
చిల్కూర్ బాలాజీ ఆలయంపై వ్యాఖ్యలు
ఈ విమర్శలను మరింత ముందుకు తీసుకెళ్లిన ష్మిట్, హైదరాబాద్లోని చిల్కూర్ బాలాజీ దేవాలయ ఫోటోను షేర్ చేస్తూ దానిని “వీసా టెంపుల్”గా పేర్కొన్నారు. అమెరికా వీసాలు పొందేందుకు భారతీయులు ఇక్కడ ప్రార్థనలు చేస్తారని, ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారని వ్యాఖ్యానించారు.
“వీసా కార్టెల్కు హైదరాబాద్లో ప్రత్యేకంగా ‘వీసా టెంపుల్’ ఉంది. వేలాది మంది భారతీయులు అమెరికా వర్క్ వీసాల కోసం అక్కడ పూజలు చేస్తారు. ఈ విధంగా రూపొందించబడిన వ్యవస్థతో అమెరికన్ ఉద్యోగులు పోటీ పడకూడదు” అని ఆయన ఎక్స్ లో రాశారు.
భారతీయ విద్యార్థులు, ఉద్యోగులపై ఆరోపణలు
మరో పోస్టులో అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థుల్లో దాదాపు సగం మంది భారతీయులేనని, వారికి పన్ను చెల్లింపుదారుల డబ్బుతో వర్క్ పర్మిట్లు లభిస్తున్నాయని ఆరోపించారు.
“వారు తరువాత H-1B, గ్రీన్ కార్డ్ వ్యవస్థల్లోకి ప్రవేశిస్తారు. అప్పటికే విద్యా రుణాలతో ఉన్న అమెరికన్ విద్యార్థులు తక్కువ ఖర్చుతో వచ్చే విదేశీ కార్మికులతో పోటీ పడాల్సి వస్తోంది” అని అన్నారు.
అంతేకాకుండా భారతీయ వీసా హోల్డర్లు అమెరికా వీసా ఇంటర్వ్యూలలో అడిగే ప్రశ్నలను ఇతర భారత అభ్యర్థులతో పంచుకుంటారని కూడా ఆరోపించారు. బిగ్ టెక్ కంపెనీలు ఉద్యోగాలను ఈ మార్గాల ద్వారా విదేశీయులకు మళ్లిస్తూ అమెరికన్లను పక్కన పెడుతున్నాయని… ప్రతిభ స్థానంలో జాతి ప్రాధాన్యత వస్తోందని వ్యాఖ్యానించారు.
హైదరాబాద్లో ‘వీసా టెంపుల్స్’
హైదరాబాద్లో అమెరికా వీసాల కోసం ప్రత్యేకంగా ప్రసిద్ధి చెందిన అనేక దేవాలయాలు ఉన్నాయి. ముఖ్యంగా విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు వీసా ఇంటర్వ్యూలకు ముందు ఈ ఆలయాలను దర్శించుకోవడం సాధారణంగా జరిగే విషయం.
వాటిలో అత్యంత ప్రసిద్ధి చెందినది చిల్కూర్ బాలాజీ ఆలయం. ఇక్కడ భక్తులు అమెరికా వీసా మంజూరు కావాలని ప్రార్థనలు చేస్తారు. అందుకే ఈ ఆలయాన్ని స్థానికులు “వీసా టెంపుల్”గా పిలుస్తుంటారు.
H-1B వీసాల్లో భారతీయుల ఆధిపత్యం
అమెరికా H-1B వీసాల మంజూరు అయిన వారిలో భారతీయులే భారీ సంఖ్యలో ఉంటున్నారు. ప్రతి ఏడాది మొత్తం H-1B వీసాల్లో సుమారు 70 నుంచి 80 శాతం వరకు భారతీయులకే లభిస్తుంటాయి. చైనా తరువాతి స్థానంలో ఉన్నప్పటికీ, వారి వాటా 12 శాతం మాత్రమే.


