తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో కీలక మార్పులకు రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు శ్రీకారం చుట్టింది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి కొత్త సిలబస్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. విద్యార్థుల్లో ప్రాక్టికల్ నాలెడ్జ్, కాన్సెప్ట్ బేస్డ్ లెర్నింగ్ను పెంచే లక్ష్యంతో ఈ మార్పులు తీసుకువస్తున్నట్లు బోర్డు తెలిపింది.
ఇప్పటి వరకు ప్రధానంగా థియరీ ఆధారంగా సాగిన ఇంటర్మీడియట్ విద్యలో ఇకపై ప్రాక్టికల్స్, ఇంటర్నల్ అసెస్మెంట్కు ప్రాధాన్యత పెరగనుంది. ముఖ్యంగా ఫస్ట్ ఇయర్ విద్యార్థుల కోసం కొత్త ఎగ్జామ్ ప్యాటర్న్ను అమలు చేయనున్నారు.
ఫస్ట్ ఇయర్లోనే ప్రాక్టికల్ ఎగ్జామ్స్
ఇక నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్లోనే సైన్స్ ,మ్యాథమెటిక్స్ సబ్జెక్టులకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రతి సబ్జెక్టులో 15 మార్కులకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉండనున్నాయి. దీంతో విద్యార్థులు కేవలం పుస్తకాల పరిజ్ఞానంతో కాకుండా, ప్రయోగాత్మక అవగాహన కూడా పెంపొందించుకోవాల్సి ఉంటుంది.
మ్యాథ్స్లో ABL అసైన్మెంట్ విధానం
మెథమేటిక్స్ సబ్జెక్టులో మొత్తం 75 మార్కుల్లో 15 మార్కులను ABL (Activity Based Learning) అసైన్మెంట్లకు కేటాయించారు. మిగతా 60 మార్కులకు థియరీ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ విధానం ద్వారా విద్యార్థుల్లో విశ్లేషణాత్మక ఆలోచన, సమస్య పరిష్కార నైపుణ్యాలు పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు.
లాంగ్వేజ్ సబ్జెక్టులకు ఇంటర్నల్ మార్కులు
తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్ భాషా సబ్జెక్టులకు ఇకపై 20 మార్కుల ఇంటర్నల్ అసెస్మెంట్ విధానం అమల్లోకి రానుంది. విద్యార్థుల హాజరు, ప్రాజెక్టులు, క్లాస్రూమ్ పనితీరు ఆధారంగా ఈ మార్కులు ఇవ్వనున్నారు.
కామర్స్ గ్రూప్లో మార్పులు
ఎకనామిక్స్, కామర్స్, అకౌంటెన్సీ సబ్జెక్టులకు కూడా 20 మార్కుల ఇంటర్నల్ విధానాన్ని ప్రవేశపెట్టింది బోర్డు. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న CEC గ్రూప్ పేరును ACE గా మార్చనున్నారు.
అలాగే సివిక్స్ సబ్జెక్ట్ స్థానంలో అకౌంటెన్సీని ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. దీనివల్ల విద్యార్థులకు ఫైనాన్స్, అకౌంట్స్ రంగాల్లో మెరుగైన అవగాహన లభిస్తుందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.
కొత్త పాఠ్యపుస్తకాలు
మారిన సిలబస్కు అనుగుణంగా కొత్త టెక్స్ట్బుక్స్ను సిద్ధం చేసి విద్యార్థులకు పంపిణీ చేయనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు వెల్లడించింది. త్వరలోనే కొత్త సిలబస్కు సంబంధించిన పూర్తి మార్గదర్శకాలను విడుదల చేసే అవకాశం ఉంది.


