యూపీఎస్సీ సివిల్స్ తుది ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులో వెయ్యి 16 మంది ఎంపికయ్యారు. ఆదిత్య శ్రీవాత్సవకు మొదటి ర్యాంకు, అనిమేష్ ప్రధాన్కు రెండో ర్యాంకు, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన దోనూరి అనన్యరెడ్డికి మూడో ర్యాంకు దక్కింది.. తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులకు ర్యాంకుల పంట పండింది. యూపీఎస్సీ ఫలితాల్లో వరంగల్కు చెందిన ముగ్గురు సెలక్ట్ అయ్యారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ముగ్గురికి ర్యాంకులు వచ్చాయి. జయసింహ , సయింపు కిరణ్, అనిల్ కుమార్ అభ్యర్థులు ఉన్నారు. జయసింహారెడ్డి 103వ ర్యాంకు సాధించగా.. గీసుకొండ మండలం అనంతారం గ్రామానికి చెందిన సయింపు కిరణ్ 568వ ర్యాంకు సాధించారు. శివనగర్ కు చెందిన కోట అనిల్ కుమార్ 764 ర్యాంక్ సాధించారు. సివిల్స్ -2023 ఫలితాల్లో మెరిసిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థుల కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఈసారి దాదాపు 50 మందికి పైగా సివిల్ సర్వీసెస్కు ఎంపికవటం పట్ల ముఖ్యమంత్రి ఆనందం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించిన పాలమూరుకు చెందిన దోనూరి అనన్య రెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలిపారు