చెన్నై: తమిళ సినీ నటుడు, టీవీకే (Tamilaga Vettri Kazhagam) అధినేత విజయ్( Vijay) రాజకీయ రంగంలో కీలక ముందడుగు వేయనున్నారు. ఇవాళ ఆయన తమిళనాడు (Tamil Nadu) గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ను కలిసి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతి కోరనున్నారు.
సమాచారం ప్రకారం.. టీవీకే పార్టీకి అవసరమైన మద్దతును సమీకరించే దిశగా విజయ్ ఇప్పటికే పలు పార్టీలతో చర్చలు ప్రారంభించారు. ముఖ్యంగా కాంగ్రెస్ ( Indian National Congress) పార్టీ మద్దతు కోరినట్టు తెలుస్తోంది. ఈ విషయంపై కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ ( K. C. Venugopal) స్పందిస్తూ, టీవీకే తమ మద్దతును కోరిన విషయం నిజమేనని తెలిపారు.
ప్రస్తుతం టీవీకే పార్టీకి సొంతంగా 108 స్థానాల్లో విజయం సాధించగా.. మెజార్టీ మార్కును అందుకునేందుకు మరో 10 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ 10 మంది బలాన్ని కూడగట్టేందుకు ఇతర పార్టీలు, నేతలతో చర్చలు జరుపుతున్నారు. మరోవైపు.. టీవీకే పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు చేజారకుండా కూడా ఆ పార్టీ ముందస్తు చర్యలు తీసుకుంటోంది. గెలిచిన 108 మంది ఎమ్మెల్యేల్లో విజయ్ మినహా.. మిగిలిన ఎమ్మెల్యేలను అందర్నీ రిసార్ట్కు తరలించింది.
ఇదే సమయంలో, విజయ్ రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారనే వార్తలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. అయితే, గవర్నర్ కార్యాలయం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఈ పరిణామం నిజమైతే, తమిళనాడు రాజకీయాల్లో ఇది ఒక కీలక మలుపుగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన విజయ్, నేరుగా ముఖ్యమంత్రి పదవికి చేరుకోవడం చారిత్రాత్మక పరిణామంగా నిలుస్తుంది.


