డొనాల్డ్ ట్రంప్ ఓ వివాదాల పుట్ట ఆధునిక అమెరికా చరిత్రలో డొనాల్డ్ ట్రంప్ అంతటి వివాదాస్పద నాయకుడు మరొకరు లేరంటారు రాజకీయ విశ్లేషకులు. ఆయన జీవితంలో ప్రతి అధ్యాయంలోనూ వివాదాలు కనిపిస్తుంటాయి.
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అంటేనే వివాదాల పుట్ట. ట్రంప్ మీదున్న వివాదాలు అమెరికా చరిత్రలో ఏ మాజీ అధ్యక్షుడి మీదా లేవు. కిందటేడాది ఆగస్టులో ఆయన మరోసారి వివాదంలో చిక్కు కున్నారు. ఇది చిన్నా చితకా వివాదం కాదు. అమెరికా సమాజంలో దుమారం రేపిన వివాదం. తాను మరోసారి అమెరికా అధ్యక్షుడు కాకపోతే రక్తపాతం జరుగుతుందని హెచ్చరించారు. ఈ ఏడాది నవంబర్లో అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగబోతున్నాయి. రిపబ్లికన్ పార్టీ తరఫున డొనాల్డ్ ట్రంప్ పోటీ చేయడం ఖాయమైనట్లే. ఈ నేపథ్యంలో రక్తపాతం జరుగుతుందంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్య అమెరికాలో దుమారం రేపింది. డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యపై అమెరికా రాజకీయవర్గాలు తీవ్రంగా మండిపడ్డాయి. దీంతో రిపబ్లికన్ పార్టీ వర్గాలు రానున్న ప్రమాదాన్ని శంకించాయి. వెంటనే వెనక్కి తగ్గాయి. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ విధానాలను విమర్శిస్తూ మాత్రమే ట్రంప్ వ్యాఖ్యానించారని ఆయన ప్రతినిధులు వివరణ ఇచ్చారు. డొనాల్డ్ ట్రంప్ను రక్షించడానికి తమకు చేతనైన సాయం చేయడానికి రిపబ్లికన్ పార్టీ నాయకులు ప్రయత్నించారు.
డొనాల్డ్ ట్రంప్పై అత్యంత తీవ్రమైన రికో చట్ట ఉల్లంఘన ఆరోపణలు నమోదయ్యాయి. రికో చట్టం అంటే సాదాసీదా వ్యవహారం కాదు. క్రిమినల్ సిండికేట్ల అణచివేతకు రికో చట్టాన్ని ఉపయోగిస్తారు. 2020 అధ్యక్ష ఎన్నికల సందర్భంగా జార్జియాలో ఫలితాలను తారుమారు చేయడానికి డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నించినట్లు ఆరోపణలు నమోదయ్యాయి. డొనాల్డ్ ట్రంప్ సహా 18 మందిపై అభియోగాలు నమోదు చేసింది. ఫుల్టన్ కౌంటీ గ్రాండ్ జ్యూరీ. తప్పుడు వాంగ్మూలాలు, దొంగ పత్రాలు సృష్టించడం, ఫోర్జరీ, సాక్షులను ప్రభావితం చేయడం, చట్టాల ఉల్లంఘన వంటి మరికొన్ని అభియోగా లను ట్రంప్ సహా 18 మందిపై మోపారు. ఈ మొత్తం ఆరోపణల్లో రికో చట్టం ఉల్లంఘనలు చాలా తీవ్రమైనవి. అయితే ఈ ఆరోపణలపై డొనాల్డ్ ట్రంప్ బృందం స్పందించింది. ఇందుకు సంబంధించి ప్రాసిక్యూటర్ పక్షపాతంతో వ్యవహరించారని దుయ్యబట్టింది.
2021 జనవరి ఆరో తేదీన పార్లమెంటు భవనంపై జరిగిన దాడి డొనాల్ట్ ట్రంప్ రాజకీయ జీవితానికి మచ్చలా మారింది. ఈ సంఘటనకు సంబంధించి ట్రంప్ పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ విచారణ కమిటీ సిఫార్సు చేసింది. అమెరికా చరిత్రలో ఒక మాజీ అధ్యక్షుడిపై క్రిమినల్ చర్యలు తీసుకో వాలంటూ కాంగ్రెస్ కమిటీ సిఫార్సు చేయడం ఇదే తొలిసారి. పార్లమెంటు భవనంపై దాడికి తన మద్దతు దారులను ట్రంప్ రెచ్చగొట్టారని ఈ కమిటీ తేల్చి చెప్పింది. పార్లమెంటు భవనంపై దాడి ఒక్కటే కాదు. ట్రంప్ రాజకీయ ప్రస్థానంలో మరికొన్ని వివాదాలున్నాయి. అధ్యక్షుడి హోదాలో ఉంటూ రెండు సార్లు అభిశంసనకు గురైన రాజకీయ నేత అమెరికా చరిత్రలో ఒక్క డొనాల్డ్ ట్రంపే. ఇంతటి ఘన చరిత్రను డొనాల్డ్ ట్రంప్ మూటగట్టుకున్నారు.
అమెరికన్ మాజీ కాలమిస్టు జీన్ కారోల్పై డొనాల్డ్ ట్రంప్ లైంగిక వేధింపులకు పాల్పడ్డ విషయం కిందటేడాది మే నెలలో వెలుగులోకి వచ్చింది. జీన్ కారోల్పై డొనాల్డ్ ట్రంప్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. అయితే ఈ ఆరోపణలను న్యూయార్క్ కోర్టు నిర్థారిం చింది. జీన్ కారోల్ కిందటేడాది అమెరికాలో హల్చల్ చేసిన పేరు. జీన్ కారోల్ ఓ మాజీ కాలమిస్టు. అమెరికా మీడియాలో జీన్ కారోల్ బాగా పాపులర్.1990ల్లో డొనాల్డ్ ట్రంప్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డారంటూ మాజీ కాలమిస్ట్ జీన్ కారోల్ కిందటేడాది ఆరోపణలు చేసిన ఓ బాంబు పేల్చారు. జీన్ కారోల్ ఆరోపణలు అమెరికా సమాజంలో హాట్టాపిక్గా మారాయి. జీన్ కారోల్ ఆరోపణలపై అమెరికా పోలీసులు కేసు పెట్టారు. దీంతో విషయం న్యాయస్థానం వరకు వెళ్లింది. న్యూయార్క్లోని ఫెడరల్ కోర్టు జీన్ కారోల్ ఆరోపణలపై విచారణ జరిపింది. ఈ ఆరోపణలపై కొన్ని నెలల కిందట న్యూయర్క్ ఫెడరల్ కోర్టు తీర్పు చెప్పింది. జీన్ కారోల్ పై లైంగిక వేధింపులకు డొనాల్డ్ ట్రంప్ బాధ్యుడేనని న్యూయార్క్లోని ఫెడరల్ కోర్టు తెగేసి చెప్పింది.ఇందుకు పరిహారంగా మాజీ కాలమిస్టు జీన్ కారోల్ కు ఐదు మిలియన్ డాలర్లు చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. కాగా న్యూయార్క్ ఫెడరల్ కోర్టు విచారణకు డొనాల్డ్ ట్రంప్ హాజరు కాలేదు. అయితే జ్యూరీ తీర్పుపై డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. న్యూయార్క్ ఫెడరల్ కోర్టు తీర్పు చూసి సిగ్గుపడాలని ట్రంప్ వ్యాఖ్యానిం చారు. తనపై భారీ ఎత్తున కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. అసలు జీన్ కారోల్ అనే మహిళ ఎవరో తనకు తెలియదని తన ట్రూత్ సోషల్ మీడియాలో రాసుకున్నారు. న్యూయార్క్ ఫెడరల్ కోర్టు తీర్పుపై డొనాల్డ్ ట్రంప్ ప్రతిస్పందన ఎలాగున్నా అమెరికాలో ఇది హాట్టాపిక్గా మారింది. అప్పటికే స్మార్టీ డేనియల్స్ వివాదంతో పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయిన డొనాల్డ్ ట్రంప్కు మాజీ కాలమిస్టు జీన్ కారోల్ ఎపిసోడ్ మరో తలనొప్పి తెచ్చిపెట్టింది.
డోనాల్డ్ ట్రంప్ ఒక దశలో భారత్పై నోరు పారేసుకున్నారు. నవంబరులో జరిగే ఎన్నికల్లో తాను గెలిచి మరోసారి అధికారంలోకి వస్తే భారత్పై ప్రతీకర పన్నులు విధిస్తానని నోరు పారేసుకున్నారు. మనదేశానికి సంబంధించి డొనాల్డ్ ట్రంప్ ఇలా వాచాలత్వంతో మాట్లాడటం ఇదే తొలిసారి కాదు. 2019లో అమెరికా అధ్యక్షుడి గా ఉన్న సమయంలోనూ భారతదేశాన్ని టారిఫ్ కింగ్ అని డొనాల్డ్ ట్రంప్ అవహేళన చేశారు. నోరు పారేసుకోవడంతోనే ఊరుకోలేదు ట్రంప్ దొరవారు. భారత్కు జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ రద్దు చేశారు. తాజాగా మరోసారి సుంకాల అంశాన్ని డొనాల్డ్ ట్రంప్ ప్రస్తావించారు. భారత పన్ను రేట్లపై ట్రంప్ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
డొనాల్డ్ ట్రంప్ అంటేనే వివాదాల పుట్ట. ఆయన అధ్యక్షుడిగా ఉన్న నాలుగేళ్ల కాలమంతా వివాదాలతోనే గడిచింది. ఇటు చైనాతోనూ అటు ఇరాన్ తోనూ వాణిజ్యరంగం విషయంలో గొడవలు పడ్డాయి. ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో కూడా ట్రంప్ ఘనాపాఠినే. 2016 అధ్యక్ష పదవికి ఎన్నికల సమయంలో ప్రవాస భారతీయుల మద్దతు కోసం ట్రంప్ తహతహలాడారు. అమెరికా పర్యటనలో ఉన్న మన ప్రధాని నరేంద్ర మోడీని మాడిసన్ స్క్వేర్ ప్రాంతానికి తీసుకెళ్లారు. నరేంద్ర మోడీని, భారత్ను ఆకాశానికి ఎత్తేశారు. అయితే భారత్ అవసరం తీరింది. దీంతో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ప్లేటు ఫిరా యించారు. భారత్పై విషం చిమ్మడం ప్రారంభించారు. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ కొలువులో అనేక మంది ప్రవాస భారతీయులు కీలక పదవుల్లో ఉన్నారు. బైడెన్ పాలన ప్రశాంతంగా నడవడానికి ప్రవాస భారతీయుల సలహాలు, సూచనలు ప్రధాన కారణమన్న అభిప్రాయం అమెరికా సమాజంలో నెలకొంది. బహుశా ఇదే భారత్పై డొనాల్డ్ ట్రంప్ విషం చిమ్మడానికి కారణం కావచ్చు అంటున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు. డొనాల్డ్ ట్రంప్ తన పాలన గురించి ఎంత స్వంత డబ్బా కొట్టుకున్నా, ఆయన హయాంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ ఊహించనంతగా దిగజారిందన్నది వాస్తవం.