పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం ప్రతిష్టాత్మక పోటీకి సిద్దమైంది. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గా గోమాస శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా స్వర్గీయ కేంద్ర మంత్రి వెంకటస్వామి మనువడు గడ్డం వంశీ, బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్లు ఖరారు కావడంతో పెద్దపల్లి లో త్రిముఖ పోటీ ఖాయమైంది. హోరాహోరీ పోరుకు రంగం సిద్ధమైం ది. పెద్దపల్లిలో ఏ పార్టీ జెండా ఎగురుతుందో?
తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పెద్దపల్లి ఎంపీ ఒకనాడు కాంగ్రెస్ కంచుకోట. కేంద్ర మాజీ మంత్రి, స్వర్గీయ జి. వెంకట్ స్వామి ఓటమెరుగని నేతగా మూడుసార్లు ఘనవిజయం సాధించారు. తన కొడుకు, ప్రస్తుతం చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గతంలో పెద్దపల్లి ఎంపీగా గెలుపొందారు. ప్రస్తుతం తాత స్వర్గీయ జి. వెంకటస్వామి వారసత్వాన్ని నిలిపేందుకు ఆయన మనుమడు జి. వంశీ కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేస్తున్నారు. తమ కంచుకోట అయిన పెద్దపల్లిని మళ్లీ చేజిక్కించుకునేందుకు కాంగ్రెస్ విస్తృతంగా కృషి చేస్తోంది. పెద్దపల్లి కోటపై కాంగ్రెస్ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది.
కేంద్రంలో అధికారం ఉన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో కనీసం పది స్థానాలను గెలుపే లక్ష్యంగా సాగుతోంది. ఈసారి పెద్దపెల్లి ఎంపీ గెలవాలనే లక్ష్యంతో ప్రముఖ పారిశ్రామికవేత్త గోమాస శ్రీనివాస్ కి టికెట్ కేటాయించింది. తెలంగాణ ఉద్యమ సెంటిమెంటుతో అధికారం చేపట్టిన బీఆర్ ఎస్ రెండు పర్యాయాలు ఈ స్థానాన్ని గెలుచుకుంది. ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్ లో చేరిన వెంకటేష్ నేత కూడా బీఆర్ఎస్ నుంచి నెగ్గినవారే. అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ నుండి పార్లమెంటు టికెట్ ఇస్తామన్నా పలువురు నేతలు తిరస్కరిస్తున్న నేపథ్యంలో పెద్దపెల్లి ఎంపీ అభ్యర్థిగా తాను నిలబడతానని ఒకప్పుడు సింగరేణి కార్మికుడైన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ముందుకు వచ్చారు. పెద్దపల్లి నియోజకవర్గం ఓటర్లలో బీఆర్ ఎస్ పట్ల ఎంతో నమ్మకం ఉందని, తాను తప్పక గెలుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొప్పుల ఈశ్వర్ ప్రధాన జాతీయ పార్టీలకు ఏ విధంగా పోటీ ఇస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. పెద్దపల్లి ఎస్సీ రిజర్వుడ్ కోటపై ఏ జెండా ఎగురుతుందో కానీ, త్రిముఖ పోరు తప్పేటట్టు లేదు.