మహబూబాబాద్ నియోజకవర్గానికి విశిష్టమైన చరిత్ర ఉంది. అది ఒకప్పుడు జనరల్ స్థానం. నేడు ఎస్టీ రిజర్వుడ్. ఒకప్పుడు రద్దయి మళ్లీ ఆవిర్భావించిన అరుదైన చరిత్ర మహబూబాబాద్ స్థానానిది. గతంలో ఎంపీలుగా చేసిన ముగ్గురు హేమా హేమీలు మళ్లీ ఎన్నికల గోదాలో ఉన్నారు. సీతారాం నాయక్, బలరామ్ నాయక్, మాలోతు కవిత మధ్య జరిగే త్రిముఖ పోరులో గెలిచేదెవరో?
మహబూబాబాద్ లోక్ సభ నియోజకవర్గానికి విశిష్ట నేపథ్యం ఉంది. మహబూబాబాద్ లోక్ సభ నియోజకవర్గం 1957లో ఏర్పాటైంది. నియోజకవర్గాల పునర్విభజన ఫలితంగా 1967లో రద్దయింది. ఆ తర్వాత 2008లో తిరిగి ఆవిర్భవించింది. ఒకసారి రద్దయి తిరిగి ఏర్పాటైన నియోజకవర్గం ఇదే. 1957, 1962 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఇటికాల మధుసూదన రావు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 1965 లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఆర్.సురేందర్ రెడ్డి విజయం సాధించారు. ఆయన ఆ తర్వాత 1967, 1989, 1991 ఎన్నికల్లో మూడుసార్లు వరంగల్ లోకసభ నియోజకవర్గం నుంచి గెలిచి రికార్డు సృష్టించారు. 1967లో మహబూబాబాద్ నియోజకవర్గం రద్దయింది. ఈ నియోజకవర్గంలోని కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లను కలిపి భద్రాచలం – ఎన్టీ- నియోజకవర్గంగా ఏర్పాటైంది. ఈ స్థానంలో 11 సార్లు ఎన్నికలు జరిగాయి. ఖమ్మం జిల్లాతో పాటు పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాలోని కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లతో కూడి తెలంగాణ, ఆంధ్రప్రాంతాలకు వారధిగా ఉన్న భద్రాచలం నియోజకవర్గం 2008లో రద్దయింది.
నియోజకవర్గాల పునిర్వభజన ఫలితంగా 2009లో మహబూబాబాద్ నియోజక వర్గం మళ్లీ ఆవిర్భ వించింది. ఈ స్థానం ఎస్టీ రిజర్వు అయింది.2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ ఎన్నికయి తొలిసారి పార్ల మెంట్ లో అడుగుపెట్టారు. యూపీఏ సర్కార్ లో కేంద్రమంత్రిగా పని చేశారు. 2014 లో టీఆర్ఎస్ అభ్యర్థిగా ఐరిలో దిగిన సీతారాంనాయక్ కాంగ్రెస్ అభ్యర్థి బలరాంనాయక్ పై విజయం సాధించారు. కాకతీయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ గా. పనిచేసిన సీతారాం నాయక్. తెలంగాణ ఉద్యమ సమయంలో చేసిన కృషిని గుర్తించి టీఆర్ఎస్ మంచి మహబూబాబాద్ ఎంపీగా పోటీ చేసే అవకాశం కేసీఆర్ ఇచ్చారు. 2019 ఎన్నికల్లో సీనియర్ నేత డీఎస్ రెడ్యానాయక్ కూతురు మాలోతు కవిత టీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచి పార్ల మెంట్ లో మొదటిసారి అడుగుపెట్టారు. మహబూబాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో మొత్తం 15,30,367 మంది ఓటర్లు ఉన్నారు. ఈ నియోజక వర్గంలో పురుషుల కన్నా మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. 746,982 మంది పురుషు ఓటర్లుండగా, 7,83,280 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.
మహబూబాబాద్ నియోజకవర్గం ఓటర్లు ప్రతిసారి విలక్షణమైన తీర్పు ఇస్తూ వచ్చారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడంతో ఇక్కడ బీఆర్ఎస్ పునాదులు కదిలిపోయాయి. ఈ నియోజకవర్గం లో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు- డోర్నకల్, మహబూబాబాద్, నర్సంపేట, ములుగు, పినపాక, ఇల్లందు, భద్రాచలం ఉన్నాయి. ఆరు అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించగా, ఒక్క భద్రాచలంలో బీఆర్ఎస్ గెలిచింది. అయితే అక్కడి నుంచి గెలిచిన తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.. దీంతో మహబూబాబాద్ పరిధి లోని అన్ని అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ గుప్పిట్లోకి వచ్చాయి. ములుగు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సీతక్క ప్రస్తుతం రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో కేబినెట్ మంత్రిగా కొనసాగుతున్నారు. 2024లో సీతారాంనాయక్ బీజేపీనుంచి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పోరిక బలరాంనాయక్, సిట్టింగ్ ఎంపీ మాలోతు కవిత బీఆర్ఎస్ నుంచి తిరిగి పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ జెండా ఎగురుతున్న ఈ నియోజకవర్గంలో ఈ సారి ఎన్నికల్లో జనం బలంతో గెలిచి మానుకోటపై ఏ పార్టీ జెండా ఎగురవేసేది ఎవరు? ఈ లోకసభ ఎన్నికల్లో సీన్ ఎలా ఉండబోతోంది.! అన్నది సర్వతా చర్చనీయంగా మారింది.


