ఈ మే నెలలో సినిమా కొత్త సినిమాని అనౌన్స్ చేయాలని గత కొన్ని రోజులుగా వెయిట్ చేస్తున్న హీరో రామ్. ఈ ఎనర్జిటిక్ హీరో ఈ మధ్య కాలంలో బాగా వెనకబడ్డాడు. మాస్ లో క్రేజ్ సంపాదించాలని.. చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇస్మార్ట్ శంకర్ మూవీ బ్లాక్ బస్టర్ అయ్యింది. రామ్ ని ఊర మాస్ గా చూపించడంతో మాస్ జనాలకు కనెక్ట్ అయ్యింది. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇక అక్కడ నుంచి రామ్.. రెడ్, వారియర్, స్కంధ, డబుల్ ఇస్మార్ట్ అంటూ వరుసగా మాస్ సినిమాలు చేసాడు కానీ.. ఇందులో ఏ ఒక్క సినిమా ఆడలేదు. రూటు మార్చి చేసిన ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ ఆంధ్రా కింగ్ తాలూకా కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. దీంతో ఆలోచనలోపడిన రామ్.. చాలా కథలు విన్నాడు కానీ.. ఏ కథ నచ్చకపోవడంతో.. అతనే కథ రాసుకున్నాడు. ఇప్పుడు కొత్త సినిమాని తన పుట్టినరోజైన మే 15న అనౌన్స్ చేయనున్నాడని టాక్ వినిపిస్తోంది.
ఇక మే నెలలో కొత్త సినిమా అనౌన్స్ చేయనున్న మరో స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో డ్రాగన్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ చేసే సినిమా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో ఉంటుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మే 20న తన పుట్టినరోజున ఈ క్రేజీ మూవీని అనౌన్స్ చేస్తారని తెలిసింది. కార్తీకేయుని గురించి త్రివిక్రమ్ అదిరిపోయే కథ రెడీ చేసారని.. ఎన్టీఆర్ తో ఈ భారీ సినిమా పట్టాలెక్కించేందుకు ప్లానింగ్ జరుగుతుందని సమాచారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో రాధాకృష్ణ ఈ మూవీని నిర్మించనున్నారు. అరవింద సమేత వీర రాఘవ సినిమా తర్వాత ఎన్టీఆర్, త్రివిక్రమ్ కలిసి చేసే ఈ ప్రాజెక్ట్ గురించి అంచనాలు భారీగా ఉన్నాయి.
రామ్, ఎన్టీఆర్ తర్వాత ఈ నెలలోనే కొత్త సినిమాను అనౌన్స్ చేసే మరో హీరో మాస్ మహారాజా రవితేజ. ప్రస్తుతం రవితేజ ఇరుముడి అనే సినిమా చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో.. ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా తర్వాత రవితేజ హసిత్ గోలి డైరెక్షన్ లో సినిమా చేయనున్నారు. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఈ నెలలోనే రానుందని టాక్. అలాగే శ్రీవిష్ణు కూడా కొత్త సినిమాను సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో చేయనున్నారు. దీనికి సన్నీ సంజయ్ డైరెక్టర్. అలాగే రంగబలి ఫేమ్ పవన్ బసంశెట్టి డైరెక్షన్ లో కూడా శ్రీవిష్ణు సినిమా చేయనున్నాడు. ఈ రెండు సినిమాలను ఈ నెలలోనే అనౌన్స్ చేయనున్నారని టాక్. ఇలా మే నెలలో రామ్, ఎన్టీఆర్, రవితేజ, శ్రీవిష్ణు కొత్త సినిమాలను ప్రకటించనున్నారని సమాచారం.


