ధన దాహంతో ఆస్పత్రులు మనుషుల ప్రాణాలను అవలీలగా తీసేస్తున్నాయి. ఆత్మీయుల కన్నీటితో చెలగాటమాడుతున్నాయి. ఓ వైపు బిడ్డ ఎలా ఉందో అని ఆస్పత్రి బయట కుటుంబ సభ్యులు ఆందోళనతో ఉంటే.. డబ్బు కోసం ఆస్పత్రుల యాజమాన్యాలు వారి కన్నీటితో ఆడుకుంటున్నాయి. చనిపోయిన పేషెంట్కు వైద్యం చేస్తున్నామంటూ ముక్కు పిండి మరీ డబ్బులు వసూలు చేసి తిరిగి డెడ్బాడీని అప్పగించడం వెనుక వారి ధన దాహం తెలుస్తోంది.
చనిపోయిన రోగికి వైద్యం చేస్తున్నామంటూ డబ్బులు కట్టించుకుంటారు. ఇది ఠాగూర్ సినిమాలోని సీన్. ఇప్పుడు ఇదే సీన్ నిజజీవితంలో రిపీట్ అయింది. హైదరాబాద్ మియాపూర్ మదీనాగూడలో సిద్ధార్థ న్యూరో ఆస్పత్రిలో ఈ ఘటన జరిగింది.
సుహాసిని (26) కళ్లు తిరిగిపోవడంతో కడపలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం సిద్ధార్థ న్యూరో ఆస్పత్రికి తీసుకొచ్చారు. నెల రోజులుగా సుహాసినికి ట్రీట్మెంట్ జరుగుతోంది. ఇప్పటి వరకు లక్షా 25 వేల రూపాయలు కట్టించుకున్నారు. ఇంకా బ్యాలెన్స్ ఎమౌంట్ 5 లక్షలు కడితే ట్రీట్మెంట్ చేస్తామని.. సుహాసిని బతుకుతుందని బంధువులకు ఆస్పత్రి యాజమాన్యం నమ్మబలికింది. అయితే శనివారం బిల్ కట్టనవసరం లేదని.. తీసుకెళ్లి నిమ్స్లో జాయిన్ చేసుకోవాలని సుహాసిని కుటుంబ సభ్యులకు చెప్పారు. దీంతో ఆమెను నిమ్స్కు తీసుకెళ్లి ఎమర్జెన్సీ వార్డులో చూపించగా.. అప్పటికే చనిపోయిందని.. అక్కడి వైద్యులు చెప్పడంతో వారు షాకయ్యారు. తిరిగి సుహాసిని డెడ్బాడీని సిద్ధార్థ ఆస్పత్రికి తీసుకొచ్చి .. ఆస్పత్రి ఎదుట ధర్నాకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.