కరీంనగర్లో రాజకీయ సెగలు రాజుకున్నాయి. కేంద్ర మంత్రి ఎంపీ బండి సంజయ్పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెను దుమారానికి దారితీశాయి. కరీంనగర్లోని గంగుల క్యాంప్ ఆఫీసుపై బీజేపీ శ్రేణులు దాడు చేశాయి.
ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బీజేపీ ఎంపీ బండి సంజయ్ను ఉద్దేశించి కొన్ని ఘాటు విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలు బీజేపీ శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి. తమ నాయకుడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ కార్యకర్తలు కరీంనగర్లో నిరసనలకు దిగారు.
నిరసన సెగ ఉధృతమై, బీజేపీ శ్రేణులు మాజీ మంత్రి గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్ను ముట్టడించాయి.
ఆఫీస్ వద్దకు భారీగా చేరుకున్న బీజేపీ కార్యకర్తలు బీఆర్ఎస్ నాయకులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఆవేశంతో ఉన్న కొందరు కార్యకర్తలు క్యాంప్ ఆఫీస్పై దాడికి దిగారు. అక్కడే ఉన్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కారు అద్దాలను నిరసనకారులు ధ్వంసం చేశారు. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో పోలీసులు స్పందించి నిరసనకారులను అడ్డుకున్నారు. దాడికి పాల్పడుతున్న బీజేపీ కార్యకర్తలను అడ్డుకుని, వారిని అక్కడి నుండి చెదరగొట్టారు. ఉద్రిక్తత పెరగకుండా అదనపు బలగాలను రంగంలోకి దించారు.
ఘర్షణకు దారితీసిన పలువురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
తమ పార్టీ నాయకులపై, ఆఫీసులపై దాడి చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
మరోవపై బండి సంజయ్పై కౌశిక్ రెడ్డి చేసిన వ్యక్తిగత విమర్శలే ఈ పరిస్థితికి కారణమని, ఆయన తక్షణమే క్షమాపణ చెప్పాలని బీజేపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి.
ప్రస్తుతం కరీంనగర్లో పరిస్థితి ఇంకాస్త ఉద్రిక్తంగానే ఉంది. పోలీసులు ప్రధాన కూడళ్ల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.


