ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడిన నేపథ్యంలో టీడీపీ చంద్రబాబు రాష్ట్ర డీజీపీకి లేఖ రాశారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో తనపై నమోదైన కేసులకు సంబంధించిన వివరాలు తెలియజేయాలని అందులో కోరారు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థి తమపై నమోదైన కేసుల వివరాలు నామినేషన్ సమయంలో అధికారులకు తెలియ జేయాలి. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేతగా గడిచిన ఐదేళ్లుగా ప్రజాసమస్యలపై తాను పోరాడుతున్నట్లు చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం తనపై పలు అక్రమ కేసులు పెట్టించిందని ఆరోపించారు. 2019 తర్వాత వివిధ జిల్లాల్లో తనపై పెట్టిన కేసుల వివరాలివ్వాలని కోరారు. రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల వివరాలను అధికారులు తనకు తెలియజేయలేదని చెప్పారు. ఆయా పోలీస్ స్టేషన్లకు వ్యక్తిగతంగా వెళ్లి సమాచారం పొందడం ఆచరణలో సాధ్యం కాదు, కాబట్టి మీ ఆఫీసు నుంచి సమాచారం కోరుతున్నానని తెలిపారు. ఈ లేఖ కాపీని రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎస్పీలకు, ఏసీబీ, సీఐడీ విభాగాలకు చంద్రబాబు పంపించారు.