అండమాన్ను తాకిన నైరుతి రుతుపవనాలు
ఈ నెల 26న కేరళను తాకనున్న తొలకరి వానలు
అండమాన్, నికోబార్లో మొదలైన వర్షాలు
భారత వాతావరణ శాఖ (India Meteorological Department) దేశ ప్రజలకు గుడ్న్యూస్ చెప్పింది. అండమాన్ సముద్రంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించినట్లు ప్రకటించింది. నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్-నికోబార్ దీవుల కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయని వెల్లడించింది. అలాగే ఆగ్నేయ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాల్లో కూడా రుతుపవనాల ప్రభావం ప్రారంభమైనట్లు తెలిపింది.
మరో మూడు నుంచి నాలుగు రోజుల్లో రుతుపవనాలు మరిన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, తూర్పు బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలోని మిగిలిన ప్రాంతాలకు కూడా మాన్సూన్ చేరుకునే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది.
ఈ నెల 26 ప్రాంతంలో కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే వాతావరణ పరిస్థితులను బట్టి ఈ తేదీ నాలుగు రోజులు ముందో, వెనుకో మారే అవకాశం ఉందని స్పష్టం చేసింది. సాధారణంగా ప్రతి ఏడాది జూన్ 1 నాటికి కేరళలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని అధికారులు పేర్కొన్నారు.
కేరళలోకి ప్రవేశించిన తర్వాత రుతుపవనాలు ఉత్తర దిశగా కదులుతూ దేశవ్యాప్తంగా విస్తరిస్తాయి. అనంతరం రాయలసీమ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చేరుకుని వర్షాలు కురిపిస్తాయి. సాధారణంగా కేరళలోకి ప్రవేశించిన 10 రోజుల తర్వాత తెలుగు రాష్ట్రాలకు రుతుపవనాలు చేరుకుంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
గత ఏడాది అనుకూల వాతావరణ పరిస్థితులు, అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నైరుతి రుతుపవనాలు సాధారణ సమయానికి కంటే ఎనిమిది రోజుల ముందుగానే కేరళలోకి ప్రవేశించాయి.
తాజా ప్రకటనతో రైతుల్లో ఆశలు చిగురించాయి. ఖరీఫ్ సాగు పనులకు రైతులు సిద్ధమవుతుండగా, త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లో తొలకరి వర్షాలు కురిసే అవకాశముందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


