వలసదారులపై ఫోకస్ చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సరైన పత్రాలు లేకుండా అగ్రరాజ్యంలో ఉంటున్న వారిని స్వదేశాలకు తిరిగి పంపిస్తున్నారు. ఇందులో భాగంగా 119 భారతీయులతో యూఎస్ నుంచి రెండో విమానం శనివారం రాత్రి 10 గంటలకు పంజాబ్లోని అమృత్సర్లో ల్యాండ్ కాబోతుంది. వారిలో 67 మంది పంజాబ్ , 33 మంది హర్యానాకు చెందినవారు ఉన్నారు. అలాగే గుజరాత్ నుండి 8 మంది, ఉత్తర ప్రదేశ్ నుండి ముగ్గురు, గోవా, మహారాష్ట్ర, రాజస్థాన్ నుండి ఇద్దరు, హిమాచల్ ప్రదేశ్ , జమ్మూ కాశ్మీర్ నుండి ఒక్కొక్కరి చొప్పున ఉన్నారు.
మూడో విమానం భారతీయులతో ఆదివారం ల్యాండ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సరైన పత్రాలు లేని భారతీయులను అమెరికా యుద్ధ విమానాల్లో రెండు వారాలకు ఒకసారి.. అందరినీ తరలించేంత వరకు ఈ బహిష్కరణలు కొనసాగనున్నాయి.
అమెరికా నుంచి ఫిబ్రవరి 5న 104 మంది భారతీయులతో మొదటి విమానం పంజాబ్ లోని అమృత్ సర్లో ల్యాండ్ అయింది. వారిలో పంజాబ్కి చెందిన వారు 30 మంది, హర్యానా, గుజరాత్ నుంచి 33 మంది చొప్పున, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర నుంచి ముగ్గురి చొప్పున, చంఢీగఢ్ నుంచి ఇద్దరు ఉన్నారు. అమెరికాలో స్థిర నివాసం కోసం వీరిలో చాలా మంది లక్షల రూపాయలు ఖర్చు చేశారు. దానికి బదులుగా మానవ అక్రమ రవాణాదారులు ఏర్పాటు చేసిన దారుల్లో దేశాలను దాటి వెళ్తూ ఘోరమైన అనుభవాలను, కష్టాలను ఎదుర్కొన్నారు.
భారతీయులు ఇండియాలో ల్యాండ్ అయినప్పుడు.. వారిని ఇక్కడికి తరలించిన విధానాలపై రకరకాల కథనాలు వెలువడ్డాయి. యూఎస్ బోర్డర్ పెట్రోలింగ్ షేర్ చేసిన వీడియోలో.. వలసదారుల చేతులకు బేడీలు వేసి, కాళ్లను తాళ్ళతో కట్టేసి ఉన్నారు. విమానంలో భారతీయులను తరలిస్తున్నప్పుడు సాధారణంగా క్రిమినల్స్ను తరలిస్తున్నట్లుగా కనిపించింది.
అమెరికా భారతీయులను స్వదేశానికి తరలించిన విధానంపై ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశాయి. సొంత పౌరులను స్వదేశానికి తరలించేందుకు ఎందుకు విమానాన్ని పంపించలేదని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి. ప్రస్తుతం మరోసారి ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ఇండియన్స్ రెండో బ్యాచ్ను ఏ విధంగా తరలిస్తున్నారో చూడాలి అంటూ ప్రశ్నిస్తున్నారు.
” ప్రస్తుతం అందరి కళ్లూ అక్రమ వలసదారులతో అమృత్సర్లో ల్యాండ్ అవబోతున్న యూఎస్ ఎయిర్క్రాఫ్ట్పైనే ఉన్నాయి. వలసదారుల చేతులకు సంకెళ్లు ఉంటాయా?.. వారి కాళ్లను తాళ్లతో కట్టేసి పంపిస్తున్నారా? ఇది భారతీయ దౌత్యానికి సంబంధించిన పరీక్ష” అంటూ కాంగ్రెస్ నేత పి. చిదంబరం అన్నారు.
పంజాబ్ పరువు తీయడానికే..
బహిష్కరణకు గురైన భారతీయుల రెండో బ్యాచ్ అమృత్సర్లో దిగబోతున్న సమయంలో.. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మన్ కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా రాష్ట్ర పరువును తీయడానికే విమానాలకు ల్యాండింగ్ సైట్గా అమృత్సర్ను ఎన్నుకుందని.. ఆరోపించారు. ఇది బీజేపీ ప్రభుత్వ కుట్ర అని ఆప్ నేత ఆరోపించారు.
“అమెరికా నుంచి వచ్చే విమానాలు ఇండియాలోకి రావాలంటే పంజాబ్లోని అమృత్సర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు దగ్గరగా ఉంటుంది.. అందుకే అక్రమ వలసదారులను తీసుకొస్తున్న యూఎస్ విమానం ఇక్కడ ల్యాండ్ అవుతుంది. అజ్ఞానంతో సమస్యను రాజకీయం చేయడం, కుట్రను ప్రోత్సహించడం మానుకోవాలి”..అని బీజేపీ నేషనల్ స్పోక్స్ పర్సన్ ఆర్పీ సింగ్ ఎక్స్లో పోస్ట్ చేశారు.