తెలంగాణలో భానుడు భగభగ మండిపోతూ నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. ఉదయం 7 గంటల నుండే పంజా విసురుతున్నాడు. అంతకంతకు టెంపరేచర్ను పెంచుతూ ప్రజలపై తన ప్రతాపం చూపి స్తున్నాడు. ఎండలకు తోడు వడగాలులు వీస్తుండటంతో ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు.
భానుడి ప్రతాపంతో తెలంగాణ నిప్పుల కొలిమిలా మారింది. రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా ఎండలు దంచికొడుతు న్నాయి. 100 ఏళ్ల నాటి రికార్డ్ బద్దలు కొడుతూ భానుడు భగభగ మండిపోతున్నాడు. దీంతో 45 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో సూరీడు సుర్రుమనిపిస్తున్నాడు. 45 డిగ్రీలను మించి ఎండలు దంచికొడుతుండటంతో ప్రజలు అల్లాడిపోతు న్నారు. గత వారం రోజులుగా సగటున 42 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో.. ఎండ తీవ్రత, వడగాలులతో ఉక్కపోతకు తాళలేక జనం ఉక్కిరిబిక్కిరవు తున్నారు. ఉదయం 8 అయిందంటే కాలు బయటపెట్టేందుకు భపడిపోతున్నారు. దీంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. మధ్యాహ్నం వేళ ఏ ఒక్కరూ బయట కనిపించక రహదారులన్నీ వెలవెలబోతున్నాయి. ఇక భానుడి ప్రతాపానికి వడదెబ్బతో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముగ్గురు మృతి చెందారు.
రాష్ట్రవ్యాప్తంగా మాడుపగిలే ఎండలు దంచికొడుతున్నాయి. నల్లగొండ జిల్లా మతూర్లో అత్యధికంగా 45.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ములుగు జిల్లా మంగపేటలో 45.2 డిగ్రీలు, నల్లగొండ జిల్లా తిమ్మాపూర్లో 45.1 డిగ్రీలు, అదే జిల్లాలోని మాడుగులపల్లిలో 45.0 డిగ్రీల రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే ఖమ్మంలో సాధారణం కంటే 4.4 డిగ్రీలు ఎక్కువ ఉష్ణోగ్రత నమోదవగా భద్రాచలం, మహబూబ్నగర్, హైదరాబాద్లలో 2–3 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిజామాబాద్లో 43.8 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.
నిప్పుల కొలిమిలా మండుతున్న ఎండలతో రాబోయే వారం రోజులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తు న్నారు వాతావరణశాఖ అధికారులు. రానున్న రెండ్రోజులు పలుచోట్ల వడగాడ్పులు వీచే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ మేరకు 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరోపక్క ఎండ తీవ్రతతో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ అధికారులతోపాటు వైద్యులు హెచ్చరి స్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని.. వేసవి తాపాన్ని తట్టుకునే ఆహారాన్ని తీసుకుని.. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెబుతున్నారు. మరి ఏప్రిల్ నెలలోనే 100 ఏళ్ల రికార్డును బద్దలు కొడితే.. మే నెలలో పరిస్థితి ఏంటో అర్థమైపోతుంది. అందుకే ఎండకు దూరంగా ఉందాం.. ఆరోగ్యాన్ని కాపాడు కుందాం.


