అమలాపురంలో టీడీపీ నేతలకు రెబల్ గుబులు పుట్టిస్తోందా..? ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఇబ్బందిగా మారారా..? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఇంతకీ తెలుగు తమ్ముళ్లకు రెబల్ రేపుతున్న గుబులు ఏంటి..? ఇబ్బందిగా మారిన పరిస్థితులేంటి..?
అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రధాన కేంద్రమైన అమలాపురంలో టీడీపీ వర్సెస్ రెబల్ రాజకీయం రంజుగా సాగుతోంది. తెలుగుదేశం నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ శ్యామ్కుమార్ స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో కాలుదువ్వుతు న్నారు. ఎవరెంత బుజ్జగించినా డోంట్ కేర్ అంటూ తన సత్తా ఏంటో నిరూపించుకే నేందుకు ఇన్నాళ్లు తాను మోసిన జెండాకే సవాల్ విసురుతున్నారు. దీంతో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆనందరావు గుండెల్లో గుబులు పుడుతోంది. ఆయనకే కాదు. హైకమాండ్ కూడా ఓటమి భయంతో కలవరపడుతోంది.
తెలుగు దేశం పార్టీ కోసం మూడు దశాబ్ధాలుగా పరమట శ్యామ్కుమార్ కష్టపడుతున్నాడు. సీనియర్ లీడర్ అయినం దున 5 పర్యాయాలు టికెట్ కోసం తీవ్రంగా శ్రమించారు. అయితే,.. ప్రతీసారి ఆయనకు నిరాశే మిగులుతోంది. ఈసారి ఎన్నికల్లో అయినా తన కల నెరవేరుతుందని.. గంపెడు ఆశతో ఎదురు చూస్తున్న పరమటకు హైకమాండ్ మొండి చేయి చూపింది. గతంలో అవకాశమిచ్చిన అయితాబత్తుల ఆనందరావుకే మళ్లీ టికెట్ కేటాయింది. దీంతో శ్యామ్ కుమార్ కలలన్నీ కల్లలయ్యాయి. ఇక పార్టీలో ఉండి లాభం లేదు అని నిశ్చయించుకున్న పరమట తిరుగుబావుట ఎగురవేశారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగి తన సత్తా ఏంటో నిరూపించుకోవాలని తహతహలాడుతున్నాడు. ఈ నిర్ణయమే తెలుగు తమ్ముళ్లను కలవరపెడుతోంది. ముఖ్యంగా కూటమి అభ్యర్థిగా పోటీలో నిలిచిన ఆనందరావు గుండెల్లో గుబులు పుట్టిస్తోంది.
మరోపక్క శ్యామ్కుమార్ నామినేషన్ వేసింది మొదలు.. అప్పటి నుంచి ఉపసంహరణ వరకూ బుజ్జగింపుల పర్వం నడిచింది. తాను బరిలో నుంచి తప్పుకోవాలని ముఖ్య నేతలంతా బుజ్జగించారు. ఎమ్మెల్యే అభ్యర్ధి ఆనందరావు, ఎంపీ అభ్యర్ధి హరీష్ ఆయన ఇంటికి వెళ్లి బతిమాలారు. అధిష్టానం దూతగా సాన సతీష్ కూడా రంగంలోకి దిగారు. పార్టీ కోసం ఎన్ని డబ్బులు ఖర్చు చేశారో అంతా తిరిగి ఇప్పిస్తామని.. అధికారంలోకి వచ్చిన తర్వాత మంచి పదవి ఇస్తామని ఆశ చూపినా శ్యామ్కుమార్ మాత్రం తలొగ్గలేదు. ప్రచార పర్వంలో తగ్గేదేలే అంటూ దూసుకుపోతున్నారు. ఇక ఎన్నికల బరిలో దిగిన శ్యామ్కుమార్కు ఈసీ ఈల గుర్తు కేటాయించింది. శ్యామ్కుమార్ దూకుడుకు కూటమిలో కలవరం మరింత పెరుగుతోంది. పరమటకు గెలిచే అవకాశాలు లేవని రాజకీయ వర్గాలు చెబుతున్నా.. భారీగా తెలుగు దేశం ఓట్లు చీలే అవకాశముంది. అదే జరిగే ఆనందరావుకు ఇక్కట్లు తప్పవన్న టాక్ వినిపి స్తోంది. ఇక మరోవైపు వైసీపీ అభ్యర్థిగా విశ్వరూప్ బరిలో ఉన్నారు. ఆనందరావు ఓడితే విశ్వరూప్ గెలుపు ఖాయమని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తనను పోటీ నుంచి తప్పుకోవాలని పరమటను ఒత్తిడి చేస్తున్నారు కూటమి నేతలు. అయితే తనది అమ్ముడుపోయే మనస్తత్వం కాదని బదులిస్తూ ఏది ఏమైనా పోటీ నుంచి తప్పుకోనని తేల్చి చెబుతున్నాడు. దీంతో టీడీపీ అభ్యర్థి ఆనందరావు ఇరకాటంలో పడ్డారని ఓటమి భయం పట్టుకుందన్న టాక్ నడుస్తోంది.
ఎన్నికల రణరంగంలో ఒక్క ఓటు కూడా గెలుపు గుర్రాలకు కీలకమే. అలాంటిది రెబల్ అభ్యర్థి 2 నుంచి 5 వేల ఓట్లు చీల్చే అవకాశముండటంతో కూటమికి ఓటమి తప్పదని రాజకీయ విశ్లేషకులు చెబుతు న్నారు. మరి వైసీపీ, కూటమి అభ్యర్థులతో సమానంగా పోటీ పడుతున్న పరమట శ్యామ్కుమార్ విజయం సాధిస్తారా..? రెబల్ జెండా రెపరెపలాడు తుందా..? ఓట్ల చీలికతో ఆనందరావుకు చేదు అనుభవం ఎదురుకానుందా..? వైసీపీ అభ్యర్థి విజయం తథ్యమా అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకూ వేచి చూడాల్సిందే.


