ములుగు జిల్లా రాజుపేట కెనరా బ్యాంక్లో భారీగా గోల్మాల్ జరిగిన సంగతి ఆలస్యంగా వెలుగు చూసింది. బ్యాంక్ అప్రైజర్ కోటి 38 లక్షలు విలువ చేసే రెండు కిలోల బంగారాన్ని కొట్టేసి పరారయ్యాడు. ఇటీవల బ్యాంక్ జరుగుతున్న వార్షిక ఆడిట్ క్రమంలో ఈ మోసం బయటపడింది. ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారం నిల్వల్లో ఏ మాత్రం పొంతన కుదరకపోవడంతో ఆడిట్ అధికారులు ఆరా తీశారు. అయితే, ఇది అప్రైజర్ పనేనని తెలుసుకున్న బ్యాంక్ మేనేజర్ అతని జాడ కోసం వెతకగా అప్పటికే భార్య పిల్లలతో ఉడాయించినట్టు తెలిసింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు బ్యాంక్ అధికారులు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక బాధితులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చూసుకుంటామని, ప్రస్తుతమున్న ధర ప్రకారం డబ్బులు ఖాతాలో వేస్తామని భరోసా ఇవ్వడంతో ఖాతాదారులు ఊపిరిపీల్చుకున్నారు.