మూడు కీలక పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఖమ్మం లోక్ సభ స్థానంలో నామినేషన్ల పర్వం ముగిసింది. నామినే షన్ల వర్షం కురిసింది. ఏకంగా 56 మంది అభ్యర్థులు 72 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. సిట్టింగ్, బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు, కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురామరెడ్డి, బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు ప్రధాన పోటీ దారులు నామినేషన్ల చివరి రోజు ఏప్రిల్ 25న ఏకంగా 22 మంది అభ్యర్థులు 25 సెట్ల నామినేషన్లు దాఖలు చేయడంతో రిటర్నింగ్ అధికారి కార్యాలయం కిటకిట లాడింది.
ఖమ్మం లోక్సభ ఎన్నికల్లో తొలిఘట్టం నామినేషన్ల సందడి ముగిసింది. నామినేషన్ల చివరి రోజున 22 మంది అభ్యర్ధులు 25 నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ సమర్పించిన అభ్యర్ధులతో రిటర్నింగ్ అధికారి ప్రమాణ స్వీకారం చేయించారు. నామినేషన్ల గడువు ముగిసే సమయానికి ఖమ్మం పార్లమెంట్ పరిధిలో 56 మంది అభ్యర్ధులు 72 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. ఈ నెల 18న నామినేషన్లు మొదలయ్యాయి. తొలిరోజు ఒకటి, 19న రెండో రోజు ఒకటి, మూడో రోజు 20న ఇద్దరు అభ్యర్ధులు రెండు నామినేషన్లు దాఖలు చేశారు. 21న ఆదివారం సెలవు కావడంతో నామినేషన్లు స్వీకరించలేదు. 22న ఏడుగురు 11 నామినేషన్లు దాఖలు చేశారు. 23న 9 మంది అభ్యర్ధులు12 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. 24న 14 మంది అభ్యర్ధులు 20 నామినేషన్లు దాఖలు చేయగా చివరి రోజున 22 మంది అభ్యర్ధులు 25 సెట్ల నామినేషన్లు వేశారు.చివరి రోజున గురువారం మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమాన్ని ముగించినట్లు రిటర్నింగ్ అధికారి విపి.గౌతమ్ తెలిపారు. చివరి రోజు అభ్యర్ధుల కోలాహాలంగా నామినేషన్ల కార్యక్రమానికి తరలివచ్చారు. కాంగ్రెస్ అభ్యర్ధిగా రామసహాయం రఘురాం రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఎంపీ రేణుకా చౌదరి, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, సీపీఎం నాయకులు తదితరులతో కలిసి వచ్చి రఘురామరెడ్డి తన నామినేషన్ను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు.
ఖమ్మం పార్లమెంట్ స్ధానానికి బీజేపీ అభ్యర్ధి తాండ్ర వినోద్ రావు మొత్తం నాలుగు సెట్లు, బీఆర్ఎస్ అభ్యర్ధి నామా నాగేశ్వరరావు నాలుగు సెట్లు, కాంగ్రెస్ అభ్యర్ధి రఘురామ రెడ్డి నాలుగు సెట్ల నామినేషన్ను దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నుండి నాయకులు రాయల నాగేశ్వరరావు, పోట్ల నాగేశ్వరరావు, ఉల్లెంగుల యాదగిరిలు కూడా మూడుసెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్ధులు ఒకరిద్దరు తప్ప అంతా ఒక్కో నామినేషన్ను దాఖలు చేశారు. నామినేషన్ల ఘట్టం ముగిసిన నేపథ్యంలో 25వరకు నామినేషన్లను స్క్రూటీని చేస్తారు. నామినేషన్లు సక్రమంగా ఉన్నాయా లేదా నిబంధనల ప్రకారం అన్ని కాలమ్ లనూ నింపారా లేదా, నామినేషన్కు దఖలు పర్చాల్సిన ధ్రువీకరణ పత్రాలు జత చేశారా లేదా అని అధికారులు క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. వీటితోపాటు పార్టీ అందించిన బీఫారం, అపిడవిట్ను అందించారా లేదా అనే విషయాలను రిటర్నింగ్ అధికారి సమక్షంలో నామినేషన్లను నిశితంగా పరిశీలి స్తారు. ఆ తర్వాత నిబంధనల ప్రకారం లేని నామినేషన్లను అధికారులు తిరస్కరించనున్నారు. నామినే షన్ల పరిశీలన గడువు, నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాతే.. ఎన్నికల గోదాలో నిలిచే అభ్యర్థులెవరో కచ్చితంగా తెలుస్తుంది.


