తెలంగాణలోప్రధాని మోదీ పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. కాసేపట్లో సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని ప్రధాని మోదీ దర్శించుకుంటారు. అనంతరం పటేల్ గూడకు వెళ్లనున్నారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ప్రధాని మోదీ దర్శించుకోనున్న నేపథ్యంలో అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయానికి వెళ్లే మార్గాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉదయం 9.30 గంటలకు ప్రధాని మోదీ ఆలయానికి చేరుకోనుండగా అర్చకులు, వేదపండితులు ఆయనకు స్వాగతం పలకనున్నారు. ఇవాళ సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. సంగారెడ్డి వేదికగా 9 వేల 21 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలను ఆయన చేయనున్నారు.పటేల్ గూడలోని ఎస్ఆర్ ఇన్ఫినిటీలో ప్రధాని బహిరంగ సభ ఉంటుంది.
సంగారెడ్డి జిల్లాలో 1409 కోట్ల రూపాయలతో నిర్మించిన NH-161 నాందేడ్ అఖోలా నేషనల్ హైవేని ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేయనున్నారు. సంగారెడ్డి X రోడ్డు నుంచి మదీనగూడ వరకు 1298 కోట్లతో NH-65ని ఆరు లేన్లుగా విస్తరించే పనులకు సైతం ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. అలాగే, మెదక్ జిల్లాలో 399 కోట్ల రూపాయలతో చేపడుతున్న పనులను మోదీ ప్రారంభిస్తారు. మెదక్- ఎల్లారెడ్డి హైవే విస్తరణ, ఎల్లారెడ్డి- రుద్రూర్ విస్తరణ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ప్రధాని బస చేసే రాజ్భవన్ సమీప ప్రాంతాలు, బేగంపేట విమానాశ్రయం నుంచి రాజ్భవన్కు రాకపోకలు సాగించే మార్గాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రాజ్భవన్, సమీప ప్రాంతాలను పూర్తిగా ఎన్ఎస్జీ అధికారులు ఆధీనంలోకి తీసుకున్నారు.
సమీప ప్రాంతాల్లో నగర పోలీసు విభాగానికి చెందిన వివిధ స్థాయిల అధికారులు 200 మంది వరకూ బందోబస్తులో పాల్గొన్నారు. ప్రధాని కాన్వాయ్ వెళ్లే సమయంలో రాజ్భవన్ మార్గంలో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 2 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే ప్రధాని బహిరంగ సభతో పాటు పరిసర ప్రాంతాల్లో ఆంక్షలను విధించారు. పటాన్చెరుకు మంగళవారం ప్రధాని మోదీ రానున్న సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించామని సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేష్కుమార్ చెప్పారు.