పశ్చిమాసియా సంక్షోభం, ఇంధన కొరత పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ( Narendra Modi) తన అధికారిక కాన్వాయ్లో వాహనాల సంఖ్యను గణనీయంగా తగ్గించారు. సాధారణంగా భారీ భద్రతా వాహనాలతో ప్రయాణించే ప్రధాని, ఇప్పుడు కేవలం రెండు వాహనాల కాన్వాయ్తోనే ప్రయాణించడం చర్చనీయాంశమైంది.
ఇంధన వినియోగాన్ని తగ్గించి దేశ ప్రజలకు పొదుపు సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రధాని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజలకు ఇంధన పొదుపు, అనవసర ఖర్చులు తగ్గించాలని సూచించిన మోదీ, ఇప్పుడు స్వయంగా అదే మార్గాన్ని అనుసరిస్తున్నారు.
సాధారణంగా ప్రధాని కాన్వాయ్లో సాయుధ మెర్సిడెస్-మేబ్యాక్ S650 గార్డ్ కార్లు, రేంజ్ రోవర్లు, టయోటా ఫార్చ్యూనర్లు, ఎస్కార్ట్ వాహనాలు, జామర్ యూనిట్లు సహా కనీసం 12 నుంచి 15 వాహనాలు ఉంటాయి. అయితే ప్రస్తుతం వాటి సంఖ్యను దాదాపు 50 శాతం తగ్గించాలని ప్రధాని ఆదేశించినట్లు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG) అధికారులు వెల్లడించారు.
అయితే భద్రతా పరమైన అంశాల్లో ఎలాంటి రాజీ ఉండదని, ప్రోటోకాల్ ప్రకారం అవసరమైన అన్ని భద్రతా ఏర్పాట్లు కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు.
కేంద్ర మంత్రులు, సీఎంలు కూడా అదే బాటలో
ప్రధాని పిలుపు మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా( Amit Shah) సహా పలువురు కేంద్ర మంత్రులు కూడా తమ కాన్వాయ్లలో వాహనాల సంఖ్యను తగ్గించినట్లు సమాచారం. అలాగే ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్( Yogi Adityanath) కూడా తన కాన్వాయ్ పరిమాణాన్ని కుదించుకున్నట్లు వెల్లడించారు.
ప్రస్తుతం పెరుగుతున్న గ్లోబల్ చమురు ధరలు, అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఇంధన పొదుపుపై ప్రత్యేక దృష్టి సారిస్తున్న నేపథ్యంలో ఈ చర్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.


