24.2 C
Hyderabad
Monday, June 16, 2025
spot_img

సంస్థాగతంగా బీజేపీలో త్వరలోనే మార్పులు చేర్పులు

లోక్‌సభ ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బతో కమలనాథుల్లో కలవరం మొదలైందా అంటే అవుననే సమాధానం విన్పి స్తోంది. సొంతంగానే 370 సీట్లు సాధిస్తామని చెప్పుకున్న బీజేపీ కేవలం 240 స్థానాలకే పరిమితమైంది. దీంతో ఎక్కడెక్కడ లోటుపాట్లు జరిగాయి. ఏయే అంశాలను చక్కదిద్దుకోవాల్సి ఉంది అన్న దానిపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా పార్టీ పునర్‌వ్యవస్థీకరణపై దృష్టి సారించారు కమల నాథులు. మరోవైపు కేడర్‌ అతి విశ్వాసం వల్లే ఈ ఫలితాలు వచ్చాయంటూ చురకలు అంటిం చింది ఆరెస్సెస్‌.

అబ్‌ కీ బార్‌ చార్‌ సౌ పార్.. అంటూ లోక్‌సభ ఎన్నికలకు ముందు గర్జించిన బీజేపీకి ప్రజలు ఝలక్ ఇచ్చారు. 2014, 2019 ఎన్నికల్లో సొంతంగానే కేంద్రంలో అధికారం చేపట్టేందుకు అవసరమైన మేజిక్ ఫిగర్  దాదాటిన కమలనాథులు ఈసారి మాత్రం బొక్కబోర్లాపడ్డారు. వికసిత్ భారత్ అంటూ ప్రజల్లోకి వెళ్లినా కమలం మాత్రం వారు ఆశించినంతగా వికసించలేకపోయింది.

వాస్తవానికి ఆర్టికల్ 370,రామ మందిర నిర్మాణం, సీఏఏ బిల్లుకు ఆమోదం.. ఇలా పలు కీలక హామీలను నెరవేర్చడం, ప్రపంచ దేశాల సరసన గొప్ప బలీయమైన శక్తిగా భారత్ నిలవడం, అంతరిక్ష రంగంలో దేశ ఘనతలు, ఇలా అనేక అంశాలు లోక్‌సభ ఎన్నికల్లో తమకు గణనీయంగా లాభం చేకూరుస్తాయని బీజేపీ నేతలు భావించారు. కానీ, సీన్ రివర్సైంది. ఇంకా చెప్పాలంటే చావుతప్పి కన్నులొట్టపోయిందన్న చందంగా బొటాబొటి మార్కులతో మిత్రపక్షాలతో కలిసి కేంద్రంలో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు. దీంతో ఇప్పుడు భాగస్వామ్య పక్షాలకు కోపం రాకుండా, అలకలు లేకుండా వారి డిమాండ్లు తీరుస్తూ ప్రభుత్వాన్ని నడపడం, ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించడం, కీలక నిర్ణయాలు గతంలో మాదిరిగా సులువుగా తీసుకోవడం కుదరద నే చెప్పాలి.

   ఈ పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ అధినాయకత్వం సంస్థాగతంగా మార్పులు చేర్పులపై దృష్టి సారించింది. కేంద్రంలో ప్రభుత్వం కూడా ఏర్పాటు కావడంతో దేశ వ్యాప్తంగా పార్టీ పరంగా పెద్ద ఎత్తున పునర్యవస్థీకరణ చేపట్టాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా మొదటగా పార్టీకి కొత్త జాతీయ అధ్యక్షు డిని నియమించాలని యోచిస్తోంది. ఇప్పటివరకు జేపీ నడ్డా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. అయితే కొత్త ప్రభుత్వంలో ఆయన చేరారు. దీంతో నడ్డా స్థానంలో వేరొకర్ని నియమిం చాల్సిన అవసరం ఏర్పడింది. పైగా ప్రస్తుత అధ్యక్షుడు నడ్డా పదవీ కాలం కూడా ఈనెల 30తో ముగు స్తోంది. దీంతో  కొత్త అధ్యక్షుడి ఎంపికను త్వరలోనే పూర్తి చేయనుంది కమల అధిష్టానం.

మరోవైపు గతంలో మాదిరిగానే ఈసారీ పార్టీకి కార్యనిర్వాహక అధ్యక్షుడిని నియమించే అవకాశం లేక పోలేదు. పైగా పార్టీలో జిల్లా, రాష్ట్ర స్థాయి కార్యవర్గాలకు ఎన్నికలతోపాటు సభ్యత్వ నమోదును భారీగా చేపట్టాలని భావిస్తోంది కాషాయ పార్టీ. దీంతో అధ్యక్షుడి ఎంపిక ఎంతో అవసరం కానుంది. ఈ విషయం లో ఒకసారి గతంలో నెలకొన్న పరిస్థితులు చూస్తే 2019లో నడ్డాను ప్రభుత్వంలో చేర్చుకోకుండా పూర్తి స్థాయిలో పార్టీ బాధ్యతలు ఆయనకు అప్పగించారు ప్రధాని మోడీ. దీంతో ఈసారి కూడా అలానే ఓ సీనియర్ నేతకు పార్టీ బాధ్యతలను పూర్తిస్థాయిలో అప్పగిస్తారన్న ప్రచారం సాగుతోంది. అయితే సీనియర్లలో చాలా మంది వరకు ప్రస్తుతం కేంద్రంలో భాగస్వాములయ్యారు. ఈ నేపథ్యంలో ఎవర్ని పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తారన్న ఆలోచన మొదలైంది. అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల్లో కొందరు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో చేరారు. దీంతో చాలా రాష్ట్రాల్లో పార్టీకి అధ్యక్షుల్ని సైతం నియమించాల్సి ఉంది. ఉదాహర ణకు తెలంగాణ నుంచి ఇప్పటివరకు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి ప్రస్తుతం కేంద్రమంత్రి వర్గంలో చోటు దక్కించుకున్నారు. దీంతో ఆయన స్థానంలో వేరొకర్ని ఎంపిక చేయాల్సి ఉంది. అయితే కిషన్ రెడ్డి స్థానంలో మల్కా జ్‌గిరి నుంచి ఎంపీగా ఎన్నికైన ఈటెల రాజేందర్‌కు ఆ బాధ్యతలు అప్పగిస్తారన్న ప్రచారం సాగుతోంది. నిజానికి ఈటెల కేంద్రమంత్రి మండలిలోనూ స్థానం ఆశించారు. అయితే బీజేపీ నుంచి గెలిచింది తొలిసారే కావడం, సీనియర్లు రాష్ట్రం నుంచి ఉండడంతో ఆయనకు అవకాశం దక్కలేదు. దీంతో ఆయన సేవలను రాష్ట్ర అధ్యక్ష పదవికి ఉపయోగించుకోవాలని కమల అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే అమిత్ షాతో సమావేశమైన ఈటెలకు ఈ దిశగా సంకేతాలు ఇచ్చా రన్న ప్రచారం సాగుతోంది.

   బెంగాల్ పార్టీ అధ్యక్షుడు సుకాంత మజుందార్ సైతం కేంద్ర ప్రభుత్వంలో చేరారు. బీహార్ పార్టీ ఉపాధ్యక్షుడు ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా పదవి చేపట్టారు. ఇక,హరియాణా పార్టీ అధ్యక్షుడు నాయబ్ సింగ్ సైనీ ఏకంగా ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో వీరి స్థానంలో కొత్త వారిని ఎంపిక చేయాల్సి ఉంది. ఇక, ఉత్తరప్రదేశ్‌లో ఎదురైన లోక్‌సభ ఫలితాలతో కమలనాథులు షాక్‌కు గురయ్యారనే చెప్పాలి. దీంతో పార్టీ అధ్యక్షుడు భూపేంద్రసింగ్ చౌధరిని మార్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. అలాగే రాజస్థాన్ బీజేపీ అధ్యక్షుడు సీపీ జోషీని సామాజిక సమీకరణాల్లో భాగంగా తప్పిస్తారన్న ప్రచారం సాగుతోంది. దీంతో రాబోయే రోజుల్లో సంస్థాగతంగా బీజేపీ పెద్ద ఎత్తున మార్పులు చేయబోతోందన్న వాదన విన్పిస్తోంది. త్వరలోనే కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆలోగానే ఈ ప్రక్రియ అంతా పూర్తి చేయాలని బీజేపీ అధినాయకత్వం ఆలోచిస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది.

   తాజా లోక్‌సభ ఫలితాలపై గొంతు విప్పింది ఆరెస్సెస్. బీజేపీ శ్రేణుల అతి విశ్వాసం వల్లే ఈ ఫలితాలు వచ్చాయంటూ అభిప్రాయపడింది. నేతలంతా మోడీనే నమ్ముకున్నారని, ప్రజలు ఏమనుకుంటున్నారు అన్న విషయాలను పట్టించుకోలేదంటూ ఆరెస్సెస్ పత్రిక ఆర్గనైజర్‌లో ఓ వ్యాసాన్ని రాసుకొచ్చింది. క్యాడరే కాదు. ఈ విషయంలో నేతలు సైతం ఇలాగే వ్యవహరించారని చురకలు అంటించింది. అసలు బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఎన్నికల్లో సంఘ్‌కు సంబంధించిన స్వయం సేవకుల సహకారం తీసుకో లేదని, అంకిత భావంతో పని చేసే పాత కార్యకర్తలను నిర్లక్ష్యం చేశారంటూ ఆరెస్సెస్‌ జీవితకాల సభ్యుడు రతన్ శార్థా వ్యాఖ్యానించారు. సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉన్న వారికే ఎక్కువ ప్రాధా న్యం ఇచ్చారని, మోడీ వల్లే గెలుస్తామన్న నమ్మకంతో కేడర్ సరిగా పని చేయలేదని రాసుకొచ్చారు రతన్. అంతేకాదు. స్థానికంగా ఉన్న నాయకులను తక్కువ చేసి చూడడం, పార్టీ ఫిరాయించిన వారికి టికెట్లు ఇవ్వడం, బాగా పనిచేసిన ఎంపీలకు టికెట్లు ఇవ్వకపోవడం లోక్‌సభ ఎన్నికల్లో సీట్లు తగ్గడానికి గల కారణాల్లో కొన్నిఅంటూ చెప్పుకొచ్చారు. అంతేకాదు ఆరెస్సెస్ ఉగ్రవాద సంస్థ అని విమర్శించిన కాంగ్రెస్ నేతలను పార్టీలో చేర్చుకోవడం మరింత దెబ్బతీసిందంటూ రతన్ శార్థా ఈ వ్యాసంలో వివరించారు. మొత్తంగా చూస్తే, ఓ వైపు మెజార్టీ రాకలోలోన మదనపడుతున్న బీజేపీ నేతలకు ఆరెస్సెస్ చురకలు మరింత ఇబ్బందిగా పరిణమించాయన్న మాట విన్పిస్తోంది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్