నీట్ యూజీ రీ ఎగ్జామ్పై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటన
జూన్ 21న నీట్ రీ ఎగ్జామ్ తేదీ ఖరారైంది: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్
విద్యార్థులకు ఎలాంటి నష్టం కలగకుండా చర్యలు తీసుకుంటున్నాం
పేపర్ లీకేజీపై ఇప్పటికే సీబీఐ విచారణ చేస్తోంది- ధర్మేంద్ర ప్రధాన్
విద్యార్థులు నష్టపోకూడదని వెంటనే రీ ఎగ్జామ్ నిర్వహిస్తున్నాం
పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ను కట్టడి చేస్తున్నాం- ధర్మేంద్ర ప్రధాన్
పరీక్ష రాసే సమయం మరో పావుగంట పెంచుతున్నాం
అభ్యర్థులు తమకు నచ్చిన నగరంలో పరీక్ష రాయోచ్చు
జూన్ 14న అడ్మిట్ కార్డులు విడుదల, జూన్ 21న పరీక్ష
పేపర్ లీకేజీ సామాజిక రుగ్మత, ఇందులో రాజకీయాలొద్దు
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది నుంచి నీట్ ( NEET UG) పరీక్షను పూర్తిగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT – Computer Based Test) విధానంలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా వైద్య ప్రవేశ పరీక్షల వ్యవస్థలో ఇది పెద్ద సంస్కరణగా భావిస్తున్నారు.
శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. పేపర్ లీకేజీ కారణంగా రద్దైన నీట్ ( NEET UG 2026) పరీక్షకు సంబంధించిన రీ ఎగ్జామ్ జూన్ 21న నిర్వహించనున్నట్లు మరోసారి స్పష్టం చేశారు. పరీక్ష అడ్మిట్ కార్డులను జూన్ 14న విడుదల చేయనున్నట్లు తెలిపారు.
మే 3న నీట్ యూజీ పరీక్ష నిర్వహించామని, అయితే మే 7న “గెస్ పేపర్”పై అనుమానాలు వ్యక్తమయ్యాయని చెప్పారు. ఆ ఫిర్యాదులను కేంద్ర దర్యాప్తు సంస్థలకు పంపించగా, కొద్ది రోజులకే ప్రశ్నాపత్రం లీకైనట్లు నిర్ధారణ అయిందన్నారు.
“పేపర్ లీక్ జరిగినట్లు స్పష్టమైన వెంటనే విద్యార్థుల న్యాయమైన అవకాశాల విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని నిర్ణయించాం. అందుకే మే 12న పరీక్షను రద్దు చేశాం,” అని ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు.
ఇంతకుముందు కూడా ఇలాంటి ఘటనల నేపథ్యంలో రాధాకృష్ణన్ కమిటీ ఏర్పాటైందని గుర్తు చేసిన ఆయన.. పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్పై ప్రభుత్వం జీరో టాలరెన్స్ విధానాన్ని కొనసాగిస్తోందన్నారు.
“సాంకేతికత పెరుగుతున్న కొద్దీ ఇలాంటి సవాళ్లు వస్తున్నాయి. కానీ విద్యార్థుల భవిష్యత్తుతో ఎలాంటి రాజీ ఉండదు. పరీక్షా వ్యవస్థను దెబ్బతీసే యాంటీ సోషల్ ఎలిమెంట్స్పై కఠిన చర్యలు తీసుకుంటాం,” అని పేర్కొన్నారు.
పరీక్షా వ్యవస్థలో ఎక్కడ లోపం జరిగిందో తెలుసుకునేందుకు సీబీఐ( Central Bureau of Investigation) సమగ్ర దర్యాప్తు చేపడుతుందని తెలిపారు. పరీక్షా ప్రక్రియను భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
“కష్టపడి చదివే విద్యార్థుల సీట్లను ఎలాంటి మాఫియా దోచుకోకూడదు. విద్యార్థుల విశ్వాసమే మాకు అత్యంత ముఖ్యం,” అని ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు.
సుప్రీంకోర్టు సిఫారసుల మేరకు ఏర్పాటు చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ( National Testing Agency)లో ఇప్పటికే పలు సంస్కరణలు జరుగుతున్నాయని, ఇంకా ‘జీరో ఎరర్’ పరీక్షల కోసం వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని తెలిపారు.
విద్యార్థులు చెల్లించిన పరీక్ష ఫీజులను తిరిగి చెల్లిస్తామని, రీ ఎగ్జామ్ను పూర్తిగా ఉచితంగా నిర్వహిస్తామని వెల్లడించారు.
అభ్యర్థుల సౌకర్యార్థం పరీక్షకు వారం ముందు తమకు నచ్చిన పరీక్ష నగరాన్ని ఎంపిక చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అవసరమైన చోట రవాణా సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
రాధాకృష్ణన్ కమిటీ సిఫారసులు అమలు చేసినప్పటికీ పరీక్షా వ్యవస్థలో లోపం చోటుచేసుకుందని అంగీకరించిన మంత్రి.. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా మరిన్ని సంస్కరణలు చేపడుతున్నామని స్పష్టం చేశారు.


