జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ మేడిగడ్డకు చేరుకుంది. కుంగిన మేడిగడ్డ బ్యారేజిని బృందం సభ్యులు పరిశీలిస్తున్నారు. 18,19, 20, 21 పిల్లర్లను పరిశీలిస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజి పరిశీ లన అనంతరం NDSA బృందం మధ్యాహ్నం అన్నారం బ్యారేజిని పరిశీలించనుంది. రేపు సుందిళ్ల బ్యారేజీని పరిశీలించనుంది.
కాళేశ్వరం బ్యారేజి పునరుద్ధరణ, మరమ్మతులు చేపట్టడానికి వీలుగా వాటి నిర్మాణం, లోపాలను అధ్యయనం చేయాలని కోరుతూ ఫిబ్రవరి 13న తెలంగాణ నీటి పారుదల శాఖ కార్యదర్శి NDSA కు లేఖ రాశారు. ఈ క్రమంలో ఈ నెల 2న కేంద్ర జలవనరుల సంఘం మాజీ ఛైర్మన్ జె.చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో ఆరుగురితో ప్రభుత్వం కమిటీ వేసింది. ఈ కమిటీ నిన్న హైదరాబాద్కు చేరుకుని జలసౌధ లో నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఇతర అధికారులతో సమావేశమైంది. ఎల్లుండి హైదరాబాద్లో నీటిపారుదల శాఖ అధికారులతో పాటు ఆయా బ్యారేజీల నిర్మాణంలో పాలుపంచుకున్న అధికారులు, నిర్మాణ సంస్థలతో సమావేశం కానుంది. అదే రోజు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనుంది. మేడిగడ్డ కుంగుబాటుపై కమిటీ విచారణ చేపట్టనుంది.