ఐపీఎల్ 2024లో ప్లేఆఫ్ యుద్ధం ఆసక్తికరంగా మారుతోంది. ప్లేఆఫ్స్ చేరుకునేందుకు జట్లు తమ వంతు ప్రయత్నం చేస్తున్నాయి. ఈ ప్రయత్నంలోనే నేడు లక్నో సూపర్ జెయింట్ వర్సెస్ ముంబై ఇండి యన్స్ తలపడనున్నాయి. ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ లక్నోలోని అటల్ బిహారీ వాజ్పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు జరగనుంది. ఒకవైపు లక్నో జట్టు టాప్ 5లో ఉండగా, మరోవైపు ముంబై జట్టు అట్టడుగున 9వ స్థానంలో ఉంది. లక్నో 9 మ్యాచ్లలో 5 గెలిచి 10 పాయింట్లతో ఐదో స్థానం లో ఉంది. అదే సమయంలో ముంబై 9 మ్యాచ్లలో 3 విజయాలతో 6 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో ఉంది.
హోమ్ గ్రౌండ్లో అద్భుతమైన రికార్డు ఉన్న లక్నోకు రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. లక్నో జట్టు 190 కంటే ఎక్కువ పరుగులు చేసింది. అయినప్పటికీ బౌలర్లు డిఫెండ్ చేయడంలో విఫలమయ్యారు. ఇంతకుముందు చెన్నై సూపర్ కింగ్స్ను వరుసగా రెండు మ్యాచ్లలోనూ ఓడించింది. కేఎల్ రాహుల్ తన జట్టు మరోసారి మంచి ప్రదర్శన చేసి ముంబైను ఓడించాలని భావిస్తున్నారు. ఇక హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ ప్రయాణం ఘోరం గా ఉంది. ఆ జట్టు తన గత రెండు మ్యాచ్ల్లోనూ ఓడిపోయింది. ముంబై టాప్ ఆర్డర్ ఐక్యంగా పని చేయడం లేదని అని టాక్ వినిపిస్తోంది. అదే సమయంలో జస్ప్రీత్ బుమ్రా మినాహా మిగతా బౌలర్లు విఫలమవడం ఆ జట్టుకు ప్రధాన సమస్యగా మారింది. ప్లేఆఫ్లో కొనసాగాలంటే ముంబై ఖచ్చితంగా లక్నో జట్టును ఓడించాలి. జట్టు పరంగా చూస్తే ఇరు జట్లు బలంగా కనిపిస్తున్నాయి.


