సమాజ్వాది పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్( Mulayam Singh Yadav) కుమారుడు, 38 ఏళ్ల వయసులో కన్నుమూశారు. బుధవారం ఉదయం ఆయనను కుటుంబ సభ్యులు లక్నో సివిల్ హాస్పిటల్కు తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ప్రతీక్ యాదవ్, బీజేపీ నేత అపర్ణ యాదవ్( Aparna Yadav భర్త కాగా, మాజీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్కు (Akhilesh Yadav) కు సవతి సోదరుడు. ఉదయం 6:15 గంటలకు కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకురాగా, ఆయన పరిస్థితి అప్పటికే విషమంగా ఉన్నట్లు సమాచారం. ఆ సమయంలో అపర్ణ యాదవ్ అక్కడ లేరని పోలీసులు తెలిపారు.
ప్రతీక్ యాదవ్కు చాలా కాలంగా ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నట్లు కుటుంబ వర్గాలు వెల్లడించాయి. ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టే సమస్యకు చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం బుధవారం ఉదయం ఒక్కసారిగా క్షీణించింది. స్పందించకపోవడంతో వెంటనే ఆస్పత్రికి తరలించినా ప్రాణాలు నిలవలేదు.
మరణానికి గల ఖచ్చితమైన కారణాలు తెలుసుకునేందుకు కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ వైద్యుల బృందం పోస్టుమార్టం నిర్వహించనుంది. ప్రాథమికంగా శరీరంపై ఎలాంటి గాయాల గుర్తులు కనిపించలేదని అధికారులు తెలిపారు.
ఎవరు ఈ ప్రతీక్ యాదవ్?
యూకేలోని లీడ్స్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేసిన ప్రతీక్ యాదవ్ ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తగా, ఫిట్నెస్ ప్రేమికుడిగా గుర్తింపు పొందారు. 2012లో అంతర్జాతీయ బాడీబిల్డింగ్ వెబ్సైట్లో “ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ది మంత్”గా కూడా ఎంపికయ్యారు.
జంతు సంక్షేమంపై ఆయనకు ప్రత్యేక ఆసక్తి ఉండేది. జంతు సంరక్షణకు సంబంధించిన పలు కార్యక్రమాలకు మద్దతు ఇచ్చేవారు.
2017లో రూ.5 కోట్ల విలువైన లంబోర్గినీ కారును కొనుగోలు చేయడంతో వివాదంలో నిలిచారు. సామాజికవాదాన్ని ప్రోత్సహించే కుటుంబానికి చెందిన వ్యక్తి ఇంత ఖరీదైన కారు కొనడం ఏంటీ అంటూ విమర్శలు వచ్చాయి. అయితే, “నేను రుణంపై కొనుగోలు చేశాను. అన్ని పత్రాలు ఉన్నాయి. నేను ఆదాయ పన్ను చెల్లిస్తాను” అని ఆయన స్పందించారు.

ములాయం సింగ్ రెండో వివాహం నుంచి జన్మించిన కుమారుడు
అఖిలేష్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్ మొదటి భార్య మాలతి దేవి కుమారుడు. అనంతరం ములాయం సింగ్, 2003లో సాధనను వివాహం చేసుకున్నారు. సాధన మొదటి భర్త చంద్రప్రకాశ్ గుప్తాతో విడాకులు తీసుకున్న తర్వాత ప్రతీక్ జన్మించాడు.
అపర్ణ యాదవ్తో ప్రేమ వివాహం
ప్రతీక్ యాదవ్, అపర్ణ యాదవ్ 2011లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఎనిమిదేళ్ల ప్రేమాయణం తర్వాత వీరి వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఈ ఏడాది జనవరిలో ఇద్దరూ విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కుటుంబ బంధాలను దెబ్బతీశారని ఆరోపిస్తూ ప్రతీక్ సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్టు కూడా చేశారు.

రాజకీయాలకు దూరంగా
యాదవ్ కుటుంబంలోని ఇతర సభ్యుల మాదిరిగా ప్రతీక్ రాజకీయాల్లోకి రాలేదు. ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో పాటు ఎలాంటి రాజకీయ పదవులు కూడా చేపట్టలేదు. 2012లో కొంతమంది సమాజ్వాది పార్టీ కార్యకర్తలు ఆయనకు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేసినా అది అమలుకాలేదు.


