పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు, రూపాయి విలువ పతనం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం బంగారం, వెండి దిగుమతులపై భారీ సుంకం విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రెండు విలువైన లోహాల దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీని 6 శాతం నుంచి 15 శాతానికి పెంచుతూ బుధవారం అధికారిక ఆదేశాలు జారీ చేసింది.
కొత్త నిర్ణయం ప్రకారం బంగారం, వెండి దిగుమతులపై 10 శాతం బేసిక్ కస్టమ్స్ డ్యూటీతో పాటు 5 శాతం అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్ (AIDC) అమల్లోకి రానుంది. ప్రస్తుతం అమెరికన్ డాలర్తో పోలిస్తే రూపాయి విలువ రూ.95.75 స్థాయికి పడిపోవడంతో విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరిగిన పరిస్థితిలో ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది.
ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రజలు అవసరం లేని బంగారం కొనుగోళ్లు తగ్గించాలని సూచించిన నేపథ్యంలో, ఇప్పుడు దిగుమతి సుంకాల పెంపు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
ప్రపంచంలో బంగారం అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉండగా, వెండి దిగుమతుల్లో మొదటి స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో సుంకాల పెంపు దేశీయ మార్కెట్పై ప్రభావం చూపే అవకాశముందని ఇండియా బులియన్ అండ్ జువెలరీ అసోసియేషన్ వర్గాలు భావిస్తున్నాయి. కొనుగోళ్లు కొంత మందగించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
భారతదేశం తన అవసరాలకు కావాల్సిన ముడి చమురులో దాదాపు 85 శాతం విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటోంది. బంగారం విషయంలో కూడా దేశీయ ఉత్పత్తి చాలా పరిమితంగా ఉండటంతో, అవసరాల్లో 90 శాతానికి పైగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. ప్రతి సంవత్సరం దేశంలో 700 నుంచి 800 టన్నుల బంగారం వినియోగం జరుగుతుండగా, దానిలో చాలా భాగం విదేశాల నుంచే వస్తోంది.
బంగారం, ముడి చమురు దిగుమతుల కోసం అమెరికన్ డాలర్లలో చెల్లింపులు చేయాల్సి రావడం వల్ల విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరుగుతోంది. దిగుమతులు అధికమైతే అంతర్జాతీయ మార్కెట్లో డాలర్కు డిమాండ్ పెరిగి, రూపాయి విలువ మరింత బలహీనపడే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.


