ఆన్లైన్ గేమ్స్, పలు బెట్టింగ్ గేమ్స్కు బానిసై మిషన్ భగీరథ ఏఈ రాహుల్ సుమారు 15 కోట్ల వరకు అప్పులు చేశాడు. డబ్బుల చెల్లింపులకు తగిన పనులు ఇప్పిస్తానని నమ్మించి కాంట్రాక్టర్ల నుంచి భారీ మొత్తంలో డబ్బులు తీసుకొన్నాడు. అతని వ్యవహారం ఉన్నతాధికారులకు తెలిసి గుట్టుగా ఆరు నెలల క్రితం సస్పెండ్ చేశారు. కీసర మండలం మిషన్ భగీరథ ఏఈగా పని చేసే రాహుల్ కాంట్రాక్టర్లకు పనులు ఇప్పిస్తానని నమ్మించి దాదాపు 37 మంది నుంచి సుమారుగా 15కోట్లకు పైగా డబ్బులు తీసుకున్నాడు. బాధితులు అతనిపై ఇచ్చిన ఫిర్యాదుతో మేరకు గతంలో అతనిపై కీసర పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి లుక్ అవుట్ నోటీసు జారీ చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో గత కొన్ని నెలలుగా పరారీలో ఉన్న అతను పరాయి దేశం పారిపోతుండగా ఢిల్లీ విమానాశ్రయంలో పోలీసులు పట్టుకున్నారు. రాహుల్ని కీసర పోలీస్ స్టేషన్కు తరలించి పోలీసులు విచారిస్తున్నారు. రాహుల్ భార్య, తల్లిదండ్రులు కూడా ప్రభుత్వ ఉద్యోగులే. వాళ్లు కొందరికి మాట ఇచ్చినా డబ్బు మాత్రం ఇవ్వడం లేదని బాధితులు పోలీసులకు తెలిపారు.