సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని వ్యాఖ్యానించిన తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ ను… సుప్రీంకోర్టు మందలించింది. ఉదయనిధి స్టాలిన్ వాక్ స్వాతంత్ర్యం….. భావ ప్రకటనా స్వేచ్ఛను దుర్వినియోగం చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటనా స్వేచ్ఛ, మత స్వేచ్ఛ కింద ఉన్న హక్కులను స్టాలిన్ దుర్వినియోగం చేశారన్న సుప్రీంకోర్టు…… ఇప్పుడు ఆయనే రక్షణ కోసం తమ దగ్గరకు వచ్చారని తెలిపింది. ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో తెలియదా అని ప్రశ్నించింది. ఉదయనిధి స్టాలిన్ సామాన్య పౌరుడు కాదని.. ఓ మంత్రి పదవిలో ఉన్నారని సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అనంతరం తదుపరి విచారణను… మార్చి 15వ తేదీకి వాయిదా వేసింది. గతేడాది సెప్టెంబరులో తమిళనాడులో జరిగిన ఓ కార్యక్రమంలో సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై దేశవ్యాప్తంగా దుమారం చెలరేగింది. ఈ క్రమంలోనే ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దాన్ని విచారణకు స్వీకరించిన ధర్మాసనం.. ఉదయనిధికి నోటీసులు జారీ చేసింది.