ప్రఖ్యాత జానపద గాయని మంగ్లీ తాజాగా తనపై జరుగుతున్న వివాదాస్పద ప్రచారంపై న్యాయపోరాటానికి దిగారు. తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో కొందరు వ్యక్తులు, కొన్ని మీడియా మరియు డిజిటల్ ప్లాట్ఫామ్లు అసత్య ప్రచారం చేస్తున్నాయని ఆరోపిస్తూ ఆమె సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు.
ఇటీవల సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్, కొన్ని డిజిటల్ మీడియా వేదికల్లో తన పేరు ప్రస్తావిస్తూ ప్రచారం చేస్తున్న వీడియోలు, కథనాలు పూర్తిగా అవాస్తవమని మంగ్లీ తన పిటిషన్లో పేర్కొన్నారు. ముఖ్యంగా తనకు ఎలాంటి సంబంధం లేని మైక్రో ఫైనాన్స్ వివాదంలో తన పేరును లాగుతూ తప్పుడు వార్తలు ప్రచారం చేశారని ఆమె ఆరోపించారు.
ఈ నేపథ్యంలో తన పరువు ప్రతిష్టలకు తీవ్ర నష్టం కలిగించేలా ప్రసారం చేసిన వీడియోలు, పోస్టులు, లింకులను వెంటనే తొలగించాలని కోర్టును కోరారు. అలాగే భవిష్యత్తులో కూడా తనపై అసత్య ప్రచారం చేయకుండా సంబంధిత వ్యక్తులు, సంస్థలను ఆదేశించాలని పిటిషన్లో విజ్ఞప్తి చేశారు.
మంగ్లీ దాఖలు చేసిన పిటిషన్ను పరిశీలించిన సిటీ సివిల్ కోర్టు పలు వ్యక్తులు మరియు మీడియా సంస్థలకు నోటీసులు జారీ చేసింది. రమావత్ మధు, అడ్వకేట్ సుబ్బారావు, హేమాకాంత్ రెడ్డి లతో పాటు కొన్ని మీడియా సంస్థలు, డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్లు, యూట్యూబ్ ఛానల్స్కు కోర్టు నోటీసులు పంపినట్లు సమాచారం.
తనపై జరుగుతున్న ఈ ప్రచారం ముందస్తు ప్రణాళికతో, కావాలనే తన వ్యక్తిగత ఇమేజ్ను దెబ్బతీయాలనే ఉద్దేశంతో జరుగుతోందని మంగ్లీ ఆరోపించారు. ఈ తప్పుడు ప్రచారం వల్ల తన కెరీర్, సామాజిక గౌరవం, వ్యక్తిగత జీవితం ప్రభావితమవుతున్నాయని ఆమె వాదిస్తున్నారు.


