తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( Revanth Reddy) తో ఉబర్ సంస్థ సీఈవో దారా ఖోస్రోషాహి (Dara Khosrowshahi) జూబ్లీహిల్స్ నివాసంలో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఉబెర్ విస్తరణ, భవిష్యత్ పెట్టుబడులు, టెక్నాలజీ అభివృద్ధిపై ఈ సమావేశంలో కీలక చర్చలు జరిగాయి.
ఈ సమావేశంలో ఉబెర్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మధు కన్నన్, ఉబెర్ ఇండియా & సౌత్ ఆసియా ప్రెసిడెంట్ ప్రభ్జీత్ సింగ్( Prabhjeet Singh), చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ప్రవీణ్ నిప్పల్లి నాగతో పాటు సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి పాల్గొన్నారు.
హైదరాబాద్లో ఇప్పటికే ఉన్న ఉబెర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను మరింత విస్తరిస్తున్నామని దారా ఖోస్రోషాహి ముఖ్యమంత్రికి తెలిపారు. అమెరికా వెలుపల ఏర్పాటు చేసిన తొలి ఉబెర్ సెంటర్ ఇదేనని, ప్రస్తుతం అక్కడ 600 మంది ఇంజినీర్లు పనిచేస్తున్నారని వెల్లడించారు.
భారత్ ఫ్యూచర్ సిటీలో ఉబెర్ కార్పొరేట్ కార్యాలయం నిర్మాణంపై కూడా సంస్థ ఆసక్తి చూపినట్లు సమాచారం. రాష్ట్రంలో వ్యాపార విస్తరణకు అనుకూల వాతావరణం ఉందని ఉబెర్ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా నగరాల్లో పెరుగుతున్న పార్కింగ్ సమస్యపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ప్రస్తావించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మల్టీ లెవల్ పార్కింగ్ సెంటర్లు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని ఉబెర్ సీఈవోకు సూచించారు.
ముఖ్యమంత్రి సూచనపై సమగ్ర అధ్యయనం చేస్తామని ఉబెర్ ప్రతినిధులు తెలిపారు. రాష్ట్రంలో వ్యాపార విస్తరణకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని సీఎం హామీ ఇచ్చారు.


