అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్( Donald Trump) మూడు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా చైనా రాజధాని బీజింగ్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్ పింగ్( Xi Jinping) తో ఆయన కీలక ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు.
ఇరాన్ యుద్ధ పరిస్థితులు, హర్మూజ్ జలసంధి ఉద్రిక్తతలు, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, చైనా-అమెరికా వాణిజ్య సంబంధాలు, తైవాన్కు అమెరికా ఆయుధాల విక్రయం, ప్రాంతీయ భద్రతా అంశాలు, కృత్రిమ మేధస్సు (AI) వంటి పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చలు జరగనున్నాయి.
దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత ట్రంప్ చైనాను సందర్శిస్తున్నారు. చివరిసారిగా 2017లో అధ్యక్ష హోదాలో ఆయన బీజింగ్కు వెళ్లారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక, ఆర్థిక ఉద్రిక్తతల మధ్య ఈ పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది.
ట్రంప్తో పాటు మస్క్, టిమ్ కుక్
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్( Elon Musk) కూడా ట్రంప్తో కలిసి బీజింగ్కు వెళ్లినట్లు వెల్లడించారు. అమెరికా ప్రతినిధి బృందంలో యాపిల్ సీఈవో టిమ్ కుక్( Tim Cook), ఎన్విడియా అధినేత జన్సన్ హుంవాంగ్( Jensen Huang) సహా పలువురు ప్రముఖ టెక్ కంపెనీల ప్రతినిధులు ఉన్నారు.
దీంతో అమెరికా-చైనా టెక్నాలజీ రంగాల్లో భారీ ఒప్పందాలు కుదిరే అవకాశాలపై అంతర్జాతీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా AI, సెమీకండక్టర్లు, టెక్ పెట్టుబడులు, సరఫరా గొలుసు (సప్లై చైన్) అంశాల్లో కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.


