కాంగ్రెస్ పార్టీ కపటనీతికి మారుపేరు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు.. ముఖ్యంగా యువతకు అరచేతిలో వైకుంఠం చూపించి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చిందని విమర్శించారు. తమ 120 రోజుల పాలనలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల తో సహా అందరికీ ద్రోహం చేయడం ప్రారంభించిందని మండిపడ్డారు.
ప్రియాంక గాంధీ వంటి కాంగ్రెస్ అగ్రనాయకులు అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులకు 4 వేల నిరుద్యోగ భృతి అందిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక.. అసలు అటువంటి హామీ ఏమివ్వలేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట మార్చారని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో భర్తీ చేసిన 30 వేల ఉద్యోగాలకు కేవలం నియామక పత్రాలను ఇచ్చి ఆ ఉద్యోగాలను నిస్సిగ్గుగా తమ ఖాతాలో వేసుకుంటోందని విమర్శించారు. అన్ని పోటీ పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తా మని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. కానీ తాము ఇచ్చిన హామీపై నిస్సిగ్గుగా యూ టర్న్ తీసుకుంటూ.. కాంగ్రెస్ ప్రభుత్వం టెట్ పరీక్ష ఫీజును రూ. 400 నుండి 2 వేలకు పెంచిందని కేటీఆర్ ఫైర్ అయ్యారు. బల్మూరి వెంకట్ వంటి కాంగ్రెస్ నాయకులను ఎన్నో కోర్టు కేసులు వేసి.. అనేక పోటీ పరీక్షలు రద్దవ్వడానికి కారణమయ్యారని ఆరోపించారు. నిరుద్యోగుల ఉసురు పోసుకుని, ప్రతిఫలంగా వెంకట్ ఎమ్మెల్సీ పదవిని అందుకున్నాడని అన్నారు. కాంగ్రెస్ అసలు రంగు ఇప్పుడిప్పుడే బయటపడు తోందన్నారు. తమని నట్టేట ముంచిన కాంగ్రెస్ పార్టీకి నిరుద్యోగ యువత గుణపాఠం చెప్పాల్సిన సమయం వచ్చిందని కేటీఆర్ ట్వీట్ చేశారు.