లోక్సభ ఎన్నికల బరి నుంచి కేసీఆర్ ఫ్యామిలీ ఎందుకు తప్పుకుంది..? 23 ఏళ్ల పార్టీ చరిత్రలో కేసీఆర్ కుటుంబం నుంచి ఒక్కరు కూడా పోటీ చేయకపోవడానికి కారణమేంటి..? ఇంట్రెస్ట్ లేకనే పోటీ చేయడం లేదా..? లేదా రిస్క్ చేయడం ఎందుకులే అని భావించారా..? పోటీకి దూరంగా ఉండడానికి కవిత జైలుకెళ్లడం కూడా ఓ కారణమేనా..?
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. మూడు ప్రధాన పార్టీల మధ్య ట్రయాంగిల్ ఫైట్ హోరాహోరీగా కొనసాగనుంది. అధికారం దక్కిన 5 నెలల్లోనే లోక్సభ ఎన్నికల పోరు ఎదరవడంతో..కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకం కానున్నాయి. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల శాతాన్ని పెంచుకున్న బీజేపీ.. లోక్సభ పోరులో గతంలో కంటే ఎక్కువ స్థానాలు సాధించాలన్న లక్ష్యంతో బరిలో దిగుతోంది. అటు బీఆర్ఎస్ కూడా తన సత్తాను చాటేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. అయితే ఈసారి ఎంపీ ఎన్నికల్లో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఎన్నికల్లో బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబం దూరంగా ఉండటంతో రాజకీయంగా చర్చకు దారి తీసింది. లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబం బరిలోకి దిగకపోవడం ఇదే తొలిసారి. 2001లో పార్టీ ఆవిర్భావం తర్వాత మొదటిసారి కేసీఆర్ కుటుంబం నుంచి ఎవరూ లోక్సభ ఎన్నికల బరిలోకి దిగడం లేదు. అయితే రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉండడం..ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో జైలుకెళ్లడం వంటి కారణాలతో కేసీఆర్ కుటుంబం పార్లమెంట్ ఎన్నికలకు దూరంగా ఉందనే టాక్ వినిపిస్తోంది.
తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ 2001లో ఏర్పడింది. తర్వాత 2004లో జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ ఎమ్మెల్యే, ఎంపీ పదవికి పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కరీంనగర్ ఎంపీగా కొనసాగారు.యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర క్యాబినెట్ మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత తెలంగాణ ఏర్పాటు కోసం యూపీఏ నుండి బయటకు వచ్చి ఎంపీ పదవికి రాజీనామా చేశారు. 2006లో జరిగిన ఉప ఎన్నికల్లో మరోసారి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత 2008 ఉప ఎన్నికల్లోను ఎంపీగా కేసీఆర్ విజయం సాధించారు.ఇక 2009లో జరిగిన ఎన్నికల్లో టీడీపీతో కేసీఆర్ పొత్తు పెట్టుకున్నారు. మహబూబ్ నగర్ నుండి పోటీ చేసిన కేసీఆర్ ఎంపీగా విజయం సాధించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో మెదక్ ఎంపీ స్థానంతో పాటు గజ్వేల్ అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి గెలుపొందారు. రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో సీఎం అయ్యారు. ఇక అదే సమయంలో కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుండి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు.
2018 రాజ్యసభ ఎన్నికల్లో బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమీప బంధువు జోగినపల్లి సంతోష్ కుమార్ బిఆర్ఎస్ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసిన కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత బీజేపీ నుండి పోటీ చేసిన ధర్మపురి అరవింద్ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత నిజామాబాద్ జిల్లా నుండి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో కవిత నిజామాబాద్ లోక్ సభ నుండి పోటీపై వెనక్కి తగ్గారు. అదే సమయంలో ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత అరెస్టు అయ్యారు. దీంతో నిజామాబాద్ నుంచి బిఆర్ఎస్ తమ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ను బరిలోకి దింపారు కేసీఆర్.ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రెండు స్థానాల్లో పోటీ చేసిన కేసీఆర్ గజ్వేల్ లో విజయం సాధించగా కామారెడ్డిలో మాత్రం ఓడిపోయారు. దీంతో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తన కుటుంబ సభ్యులు పోటీ చేసి ఓడిపోతే రాజకీయంగా డ్యామేజ్ అవుతుందని భావించి ఎన్నికలకు కేసీఆర్ కుటుంబం దూరంగా ఉందనే చర్చ నడుస్తోంది. మొత్తంగా చూస్తే పార్టీ ఆవిర్భవించిన 23 ఏళ్ల తర్వాత కేసీఆర్ కుటుంబం లోక్సభ ఎన్నికల్లో మొదటిసారిగా పోటీకి దూరంగా ఉండటం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.