స్వతంత్ర వెబ్ డెస్క్: రెండు నెలలుగా అభిమానులను ఉర్రూతలూగించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 16వ సీజన్లో చెన్నై విజేతగా నిలిచింది. వరుణుడి ఆటంకం మధ్య డక్వర్త్ లూయిస్ పద్ధతిలో ఫలితం తేలిన పోరులో చెన్నై 5 వికెట్ల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ను మట్టికరిపించింది. తద్వారా ఐపీఎల్లో ఐదో టైటిల్ నెగ్గి.. ముంబై ఇండియన్స్ను సమం చేసింది. వర్షం కారణంగా ఆదివారం జరగాల్సిన మ్యాచ్ సోమవారానికి వాయిదా పడగా.. రిజర్వ్ డే నాడు కూడా మ్యాచ్ను వరుణుడు వదల్లేదు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (47 బంతుల్లో 96; 8 ఫోర్లు, 6 సిక్సర్లు) తృటిలో సెంచరీ చేజార్చుకోగా.. వృద్ధిమాన్ సాహా (39 బంతుల్లో 54; 5 ఫోర్లు, ఒక సిక్సర్) అర్ధశతకం నమోదు చేసుకున్నాడు.
ఐపీఎల్ ఫైనళ్లలో మొదట బ్యాటింగ్ జట్లవే మెజారిటీ విజయాలు. అయినా సోమవారం టాస్ గెలిచిన ధోని బౌలింగ్ ఎంచుకున్నాడు! మ్యాచ్కు వర్షం ముప్పు ఉండటంతో.. ఛేదనకే మొగ్గు చూపాడు చెన్నై సారథి. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ ఏకంగా 214 పరుగులు కొట్టేసరికి.. ధోనీసేనకిక కష్టమే అనుకున్నారంతా! అక్కడి నుంచి మ్యాచ్ యథాప్రకారం కొనసాగి ఉంటే మజానే ఉండేది కాదేమో. ఆదివారం జరగాల్సిన ఐపీఎల్-16 ఫైనల్ను నాటకీయ రీతిలో తర్వాతి రోజుకు వాయిదా వేయించిన వరుణుడు.. సోమవారం మళ్లీ రంగప్రవేశం చేయడం కథలో కీలక మలుపు! రెండున్నర గంటలు ఆగిన ఆట.. అర్ధరాత్రి పునఃప్రారంభమయ్యాక మొదలైంది అసలు మజా!
ఐపీఎల్-16 ట్రోఫీ గుజరాత్ను ఊరించి.. ఊరించి.. చివరికి చెన్నైకే చిక్కింది. బంతి బంతికి ఆధిక్యం చేతులు మారుతూ సాగిన పోరులో ధోనీ సేన దుమ్మురేపింది. సోమవారం తీవ్ర ఉత్కంఠ మధ్య.. అత్యంత హోరాహోరీగా సాగి ఆఖరి బంతికి ఫలితం తేలిన మ్యాచ్లో చెన్నై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట గుజరాత్.. 4 వికెట్లకు 214 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇక తన ఇన్నింగ్స్ మొదలుపెట్టిన చెన్నైకి 3 బంతులు పడ్డాయో లేదో వరుణుడు ప్రతాపం చూపాడు. దీంతో.. చెన్నై లక్ష్యాన్ని డక్వర్త్ ల్యూయిస్ పద్ధతి ప్రకారం 15 ఓవర్లలో 171 పరుగులకి కుదించారు. పరిస్థితులు సద్దుమణిగాక.. రెండున్నర గంటలకు పైగా విరామం తర్వాత తిరిగి ఆట ఆరంభం కాగా.. బరిలోకి దిగిన చెన్నై ఓపెనర్లు తొలి బంతి నుంచే విధ్వంసానికి దిగారు. ముఖ్యంగా కాన్వే చెలరేగిపోయాడు. దొరికిన బంతిని దొరికినట్లే బౌండరీకి పంపేశాడు. జీటీ బౌలర్లకు చుక్కలు చూపించారు. అయితే.. ఓపెనర్లు వెనువెంటనే ఔట్ అవ్వగానే, చెన్నై ఇన్నింగ్స్ కాస్త నెమ్మదించింది. ఆ తర్వాత మళ్లీ పుంజుకుంది. లక్ష్యం చేరువవుతున్నకొద్దీ.. చెన్నై బ్యాటర్లు ఒక్కొక్కరుగా విజృంభించారు. నువ్వా నేనా అంటూ సాగిన పోరు.. క్లైమాక్స్కు చేరుకుంది. ఆఖరి ఓవర్లో 13 పరుగులు కావాలి. 4 బంతుల్లో మోహిత్ ఇచ్చిన పరుగులు మూడే. గుజరాత్లో విజయోత్సాహం.. చెన్నైలో నిరాశ! కానీ అయిదో బంతికి జడేజా సిక్సర్ కొట్టి ఉత్కంఠను పతాక స్థాయికి తీసుకెళ్లాడు. చివరి బంతికి పుల్ టాస్ను ఫైన్లెగ్ వైపు ఇలా కొట్టాడో లేదో.. క్షణాల్లో బంతి బౌండరీని దాటేసింది. స్టేడియంలో పసుపు దళం సంబరాలు అంబరాన్నంటాయి. అయిదో ఐపీఎల్ ట్రోఫీ వచ్చి చెన్నై ఒళ్లో వాలింది. వరుసగా రెండో టైటిల్ సాధించాలన్న గుజరాత్ ఆశలపై ‘నీళ్లు’ పడ్డాయి. ధోని ఇంకో ఐపీఎల్ ఆడటం అనుమానమే అని భావిస్తున్న నేపథ్యంలో.. 42 ఏళ్ల వయసులో అతను మరో ట్రోఫీ అందుకుని కెరీర్లో పతాక ఘట్టాన్ని చిరస్మరణీయం చేసుకున్నట్లయింది.


