యూఏఈలోని ఫుజైరా ఆయిల్ ఇండస్ట్రీ జోన్లో ఉన్న ఓ చమురు శుద్ధి కేంద్రంపై ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. ఈ ఘటనలో ముగ్గురు భారతీయులకు గాయాలయ్యాయి. ఈ దాడిని భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. పౌరులు, మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం అంగీకారయోగ్యం కాదని స్పష్టం చేసింది.
పశ్చిమాసియాలో శాంతి, స్థిరత్వం కోసం చర్చలు మరియు దౌత్య మార్గాలకే భారత్ మద్దతు ఇస్తుందని తెలిపింది. హర్మూజ్ జలసంధి ద్వారా స్వేచ్ఛా నౌకాయానం కొనసాగాలని భారత్ ఆకాంక్షించింది.
ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ దాడులను ఖండిస్తూ, పౌరులపై దాడులు ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. ప్రపంచ ఇంధన భద్రత కోసం హర్మూజ్ మార్గం సురక్షితంగా ఉండాలని ఆయన అన్నారు.
అంతర్జాతీయ దేశాలు కూడా ఉద్రిక్తతలు తగ్గించాలని పిలుపునిచ్చాయి. కాగా ఇరాన్ మాత్రం ఇది కావాలని చేసిన దాడి కాదని, అమెరికా చర్యలే కారణమని వ్యాఖ్యానించింది.


