ఐసీసీ తాజాగా విడుదల చేసిన వార్షిక వన్డే జట్ల ర్యాంకింగ్స్లో టీమిండియా మరోసారి తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. మొత్తం 118 రేటింగ్ పాయింట్లతో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. గత కొన్నేళ్లుగా వన్డే ఫార్మాట్లో నిలకడైన ప్రదర్శన చేస్తున్న భారత జట్టు టాప్ పొజిషన్ను సుస్థిరం చేసుకుంది.
రెండో స్థానంలో న్యూజిలాండ్ 113 పాయింట్లతో నిలవగా, ఆస్ట్రేలియా 109 పాయింట్లతో మూడో స్థానాన్ని దక్కించుకుంది. ఇదిలా ఉండగా సౌతాఫ్రికా అద్భుత ప్రదర్శనతో పాకిస్థాన్ను వెనక్కి నెట్టి టాప్-4లోకి ఎంట్రీ ఇచ్చింది. సౌతాఫ్రికా ప్రస్తుతం 102 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉండగా, పాకిస్థాన్ 95 పాయింట్లతో ఐదో స్థానానికి పడిపోయింది.
ఇక శ్రీలంక 96 పాయింట్లతో ఆరో స్థానంలో ఉండగా, అఫ్గానిస్థాన్ 93 పాయింట్లతో ఏడో స్థానంలో కొనసాగుతోంది. ఇంగ్లాండ్ 89 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో నిలిచింది. బంగ్లాదేశ్ 84, వెస్టిండీస్ 74 పాయింట్లతో తదుపరి స్థానాల్లో ఉన్నాయి.
ఈ ర్యాంకింగ్స్ను ఐసీసీ గత మూడేళ్లలో జట్లు ఆడిన మ్యాచ్ల ఆధారంగా ప్రకటించింది. ఐసీసీ నిబంధనల ప్రకారం 2025 మే తర్వాత జరిగిన మ్యాచ్లకు 100 శాతం వెయిటేజ్ ఇవ్వగా, అంతకుముందు రెండేళ్ల మ్యాచ్లకు 50 శాతం వెయిటేజ్ను పరిగణనలోకి తీసుకుంది.
ఇక 2027 వన్డే వరల్డ్కప్ కోసం ఐసీసీ ఫార్మాట్లో కీలక మార్పులు చేసింది. 2023 వరల్డ్కప్ను 10 జట్లతో రౌండ్-రాబిన్ పద్ధతిలో నిర్వహించగా, 2027 టోర్నీలో మొత్తం 14 జట్లు పాల్గొననున్నాయి. ఈ 14 జట్లను ఏడు జట్ల చొప్పున రెండు గ్రూపులుగా విభజిస్తారు. ప్రతి గ్రూప్ నుంచి అగ్రస్థానంలో నిలిచిన మూడు జట్లు సూపర్ సిక్స్ దశకు అర్హత సాధిస్తాయి. అక్కడి నుంచి సెమీ ఫైనల్స్, ఫైనల్ మ్యాచ్లు నిర్వహిస్తారు.
2027 మార్చి 31 నాటికి ఐసీసీ ర్యాంకింగ్స్లో టాప్-8లో నిలిచిన జట్లు నేరుగా వరల్డ్కప్కు అర్హత సాధిస్తాయి. ఆతిథ్య దేశాలైన సౌతాఫ్రికా, జింబాబ్వేలకు ఆటోమేటిక్ ఎంట్రీ లభిస్తుంది. మిగిలిన జట్లను 2027లో నిర్వహించే వరల్డ్కప్ క్వాలిఫైయర్ టోర్నమెంట్ ద్వారా ఎంపిక చేస్తారు.
అయితే సహ-ఆతిథ్య దేశమైన నమీబియాకు మాత్రం పూర్తి స్థాయి ఐసీసీ సభ్యత్వం లేకపోవడంతో నేరుగా అర్హత దక్కదు. ఆ జట్టు కూడా క్వాలిఫయర్ ద్వారా మాత్రమే వరల్డ్కప్ బెర్త్ కోసం పోటీ పడాల్సి ఉంటుంది.


