పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ( Mamata Banerjee) ఎన్నికల ఫలితాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను సీఎం పదవికి రాజీనామా చేయబోనని స్పష్టంగా ప్రకటించారు. తమ పార్టీ ఎన్నికల్లో ఓడిపోలేదని, ఫలితాలు బీజేపీ కుట్రల కారణంగా తారుమారయ్యాయని ఆరోపించారు.
మమతా బెనర్జీ మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో తాము ప్రత్యర్థి పార్టీలతో కాకుండా “విలన్లతో” పోరాడాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు. కేంద్ర ఎన్నికల సంఘం (CEC) పాత్రపై కూడా ఆమె తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈసీ బీజేపీకి అనుకూలంగా వ్యవహరించిందని, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత లోపించిందని అన్నారు.
ముఖ్యంగా ఓటర్ల జాబితాలో మార్పులు, ఓట్ల తొలగింపు వంటి అంశాలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ, బీజేపీకి సుమారు 100 సీట్లు అన్యాయంగా లభించాయని ఆరోపించారు. ప్రజాస్వామ్య విలువలు దెబ్బతిన్నాయని, ఈ పరిస్థితి దేశానికి మంచిది కాదని చెప్పారు.
ప్రతిపక్ష పార్టీలను లక్ష్యంగా చేసుకోవడం బీజేపీకి అలవాటైందని విమర్శించిన మమతా… ఈ పరిస్థితులపై తాము పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఓట్ల చోరీ, ఎన్నికల అక్రమాలపై చట్టపరంగా , రాజకీయంగా పోరాడతామని స్పష్టం చేశారు.
ఈ వ్యాఖ్యలతో పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరింత వేడెక్కే అవకాశముంది.


