స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణాలో మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వర్షాల నేపథ్యంలో ప్రజలు బయటకు వచ్చేటప్పుడు, ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నిజామాబాద్, జగిత్యాల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్, యాదాద్రి భువనగరి, హనుమకొండ, హైదరాబాద్, రంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, నాగర్ కర్నూలు, సూర్యాపేట, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో నేడు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది.
ఓవైపు పరిస్థితి ఇలా ఉంటే మరోవైపు రాష్ట్రంలోని 9 జిల్లాలు.. పెద్దపల్లి, కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, వరంగల్, ములుగు, భూపాలపల్లి, ఖమ్మం, హనుమకొండ జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నట్టు వ్యవసాయశాఖ ప్రభుత్వానికి తెలిపింది. ఈ జిల్లాల్లో అతి తక్కువ వర్షపాతం నమోదైందని పేర్కొంది.