మాట తప్పడం… మడమ తిప్పడం… ఇదేనా కాంగ్రెస్ మార్కు పాలన… అంటూ హరీశ్ రావు ట్వీట్ చేశారు. పథకాల అమలులో ఎన్ని సార్లు మాట మార్చుతారని మండిపడ్డారు. ఎన్ని సార్లు ప్రజలను మోసం చేస్తారని ఆక్షేపించారు. డిసెంబర్ 9 2023న రుణమాఫీ చేస్తామని చెప్పి… ఆగస్టు 15లోపు చేస్తామని మరోసారి చెప్పి దసరా వరకు చేశారన్నారు. నేటికీ 20 లక్షల మంది రైతులకు రుణమాఫీ అందలేదన్నారు. రైతు బంధు ఇప్పుడు తీసుకుంటే 10 వేలు డిసెంబర్ 9 తర్వాత తీసుకుంటే 15 వేలు అని ప్రచారం చేసి… వానాకాలం ఎగ్గొట్టారని ఆక్షేపించారు.
యాసంగి భరోసా సంక్రాంతికి ఇస్తామని… మాట మార్చి జనవరి 26 అన్నారని తెలిపారు. ఇప్పుడు మరోసారి మార్చి 31 వరకు అంటున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ రైతు బంధు ఇచ్చి రైతన్నకు దన్నుగా నిలిస్తే… దాన్ని ఎగ్గొట్టి రైతులకు భరోసా లేకుండా రేవంత్ చేశాడని విమర్శించారు. ఆసరా 4 వేలు, తులం బంగారం, మహిళలకి 2 వేల 500, విద్యా భరోసా కార్డు, ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇవన్నీ ఇందిరమ్మ రాజ్యంలో ఏమయ్యాయో ఆ ఇందిరమ్మకే తెలియాలంటూ ఎక్స్ వేదికగా ప్రభుత్వంపై మండిపడ్డారు మాజీ మంత్రి హరీశ్ రావు.