ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ టికెట్ దక్కని వారు పార్టీలు మారుతున్నారు. వైసీపీ టికెట్ దక్కని నేతలు టీడీపీలో చేరుతున్నారు. ఏపీ మంత్రి గుమ్మనూరు జయరాం సైతం టీడీపీలో చేరేందుకు రెడీ అయ్యారు. ఇవాళ వైసీపీకి, మంత్రి పదవికి ఆయన రాజీనామా చేయనున్నారు. సాయంత్రం టీడీపీ అధినేత చంద్రబాబును కలవనున్నారు. ఇప్పటికే గుమ్మనూరు విజయవాడ చేరుకున్నారు.
అనంతపురం జిల్లా గుంతకల్ టికెట్ ఇచ్చేందుకు టీడీపీ హామీ ఇచ్చిందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయనతో పాటు అనుచర వర్గం వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆలూరు, గుంతకల్లు టీడీపీ నేతలు గుమ్మనూరు చేరికపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఆలూరు నుంచి తిరిగి పోటీ చేసేందుకు వైసీపీ అధిష్టానం టికెట్ కేటాయిం చేందుకు నిరాకరించడంతో టీడీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నాడు. ఆలూరు నియోజకవర్గం నుంచి తాను సూచించిన వ్యక్తిని కాకుండా ఆస్పరి ZPTC విరుపాక్షికి వైసిపి ఆలూరు నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించటాన్ని మంత్రి జీర్ణించుకోలేకపోయారు. ఇప్పటికే ఆలూరు నియోజకవర్గం లోని పలువురు వైసిపి నాయకులు పదవులకు రాజీనామా చేశారు.