తెలంగాణ ఉద్యమంలో పోరుగడ్డగా నిలిచింది ఓరుగల్లు. మరీ ముఖ్యంగా తెలంగాణలో పోరాటాల గడ్డ అంటే అందరికీ గుర్తుకొచ్చేది వరంగల్లే. మరికొద్ది రోజుల్లో పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ వెలువడనున్న నేపథ్యంలో ఓరుగల్ల గడ్డపై రాజకీయ సమీకరణలు శరవేగంగా మారిపోతున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీల నుంచి లోక్ సభ ఎన్నికల బరిలో దిగాలనే ఆలోచనలో ఉన్న నేతలు.. ఏ పార్టీలోకి వెళ్లాలన్న దానిపై తర్జనభర్జనలు పడుతున్నారు. దీంతో రాజకీయ వలసలు ఊపందుకున్నాయి.
సార్వత్రిక ఎన్నికల వేళ.. పలువురు బీఆర్ఎస్ నేతలు కారు దిగుతున్నారు. గులాబీ పార్టీ నుంచి పలువురు ముఖ్య నేతలు కాంగ్రెస్, బీజేపీ వైపు వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారు. తమ అదృష్టాన్ని పరీక్షించుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్కు చెందిన పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా నాగర్కర్నూల్ ఎంపీ పి. రాములు, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కమలం పార్టీలో చేరారు. ముందుగానే కుదిరిన ఒప్పందం మేరకు నాగర్ కర్నూల్ ఎంపీ రాములు కొడుకు భరత్కు.. నాగర్ కర్నూల్, అలాగే జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్ను బీజేపీ తమ పార్టీ అభ్యర్థులుగా ప్రకటించింది. తెలంగాణలో బీజేపీ అధిష్టానం 9 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. రాష్ట్రంలో ఇంకో ఎనిమిది పార్ల మెంటు స్థానాల్లో కమలం నేతలు తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈ క్రమంలో ఆ ఎనిమిది పార్ల మెంటు నియోజకవర్గాల్లో పార్టీ మార్పుపై ఉగిసలాటలో ఉన్న బీఆర్ఎస్ నేతలు తర్జనభర్జనలు పడుతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
బీజేపీ ప్రకటించాల్సి ఉన్న ఎనిమిది స్థానాల్లో తాము ఉండేలా చూసుకునేందుకు కొందరు బీఆర్ఎస్ నేతలు ప్రయ త్నాలు సాగిస్తున్నట్లుగా టాక్ నడుస్తోంది. ప్రధాని మోడీ ఛర్మిష్మాతో ఈసారి పోటీ చేస్తే సులువుగా గట్టెక్కవచన్నది వీరి భావనగా కన్పిస్తోంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఎంపీ నామానాగేశ్వరరావు బీజేపీ నేతలతో టచ్లోకి వెళ్లారని ప్రచారం సాగుతోంది. త్వరలోనే బీజేపీలో చేరి కమలం అభ్యర్థిగా లోక్ సభ ఎన్నికల బరిలో దిగాలనే ఆలోచనలో నామా ఉన్నట్లు సమాచారం. ఒకటి రెండు రోజుల్లోనే దీనిపై ఓ ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇక, మహబూబాబాద్ ఎస్టీ రిజర్వుడు లోక్సభ స్థానం నుంచి బీఆర్ఎస్కు చెందిన మాజీ ఎంపీ అజ్మీర సీతారాంనాయక్ను బీజేపీ తమ పార్టీ అభ్యర్థిగా బరిలో దింపేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
వరంగల్ ఎస్సీ రిజర్వుడు లోక్సభ స్థానం నుంచి బలమైన అభ్యర్థిని తమ పార్టీ నుంచి ఎన్నికల బరిలోకి దింపాలనే యోచనలో ఉంది బీజేపీ నాయకత్వం. దీంతో.. బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కాషాయ పార్టీ నేతలతో టచ్లోకి వెళ్లినట్లు సమాచారం. పార్టీ మార్పుపై కొద్ది రోజుల నుంచి అరూరి, కమలనాథుల నడుమ చర్చలు జరిగినట్లు సమాచారం. బీఆర్ఎస్లో రమేష్ కొంత అసంతృప్తితో ఉన్నారనే వార్తల నేపథ్యంలో ఆయన కారు దిగి కమలం పార్టీలో చేరడానికే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య ఆరూరి రమేష్ను కలిసి బీఆర్ఎస్లోనే కొనసాగాలని కోరినట్లు తెలుస్తోంది. మరి.. ఈ వలసలు ఇలాగే కొనసాగితే.. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బిఆర్ఎస్ పరిస్థితి ఏంటి అన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారుతోంది.