తెలంగాణలో మత్తు పదార్థాల నియంత్రణపై ప్రభుత్వం అత్యంత సీరియస్గా ఉందని డీజీపీ సీ.వి. ఆనంద్ స్పష్టం చేశారు. పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఈగల్ ఫోర్స్ పనితీరును సమీక్షించిన ఆయన, డ్రగ్స్ నిర్మూలనను టాప్ ప్రయారిటీగా తీసుకున్నామని వెల్లడించారు. ఈగల్ ఫోర్స్ డీజీ సందీప్ శాండిల్య, ఎస్పీ పద్మజాతో పాటు సిబ్బందితో సుమారు మూడు గంటల పాటు సమావేశం నిర్వహించి ఇప్పటివరకు జరిగిన ఆపరేషన్లు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన డీజీపీ, ఈగల్ ఫోర్స్ బ్యూరోగా ఏర్పడిన తర్వాత మంచి ఫలితాలు సాధించిందన్నారు. రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా నిర్వహించిన ఆపరేషన్ల ద్వారా అనేక మంది డ్రగ్ నిందితులను అరెస్టు చేశారని తెలిపారు. స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకుంటూ అనేక ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించామని చెప్పారు.
డ్రగ్ సప్లయర్ల ఆస్తులను సీజ్ చేయడం, వాహనాలను స్వాధీనం చేసుకోవడం వంటి చర్యలు కొనసాగుతున్నాయని ఆయన వెల్లడించారు. అయితే డ్రగ్స్ నియంత్రణ బాధ్యత కేవలం ఈగల్ ఫోర్స్కే పరిమితం కాదని, రాష్ట్రంలోని కమిషనర్లు, ఎస్పీలు కూడా పూర్తి స్థాయిలో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే సిబ్బందిని పెంచుతూ జిల్లాల్లోని నార్కోటిక్ పోలీస్ స్టేషన్లు, ప్రత్యేక సెల్లను మరింత సమర్థవంతంగా పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
రాష్ట్ర ప్రజల్లో, ముఖ్యంగా తల్లిదండ్రుల్లో పిల్లల భద్రతపై ఆందోళన పెరుగుతోందని డీజీపీ పేర్కొన్నారు. కాలేజీలు, హాస్టల్స్కు వెళ్లే విద్యార్థులు డ్రగ్స్ ప్రభావానికి గురవుతారేమో అన్న భయం ఉందన్నారు. ఈ భయాన్ని తొలగించేందుకు త్వరలో రాష్ట్రవ్యాప్తంగా మూకుమ్మడి డ్రైవ్లు చేపట్టనున్నట్లు వెల్లడించారు.
ఇప్పటికే రాష్ట్రంలో 4,500 యాంటీ డ్రగ్ కమిటీలు ఉన్నప్పటికీ, అవి ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదని డీజీపీ అసంతృప్తి వ్యక్తం చేశారు. త్వరలో ఈ కమిటీలకు కొత్త బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలిపారు. ర్యాగింగ్, విద్యార్థులపై అసభ్య ప్రవర్తన, ట్రాఫిక్ అవగాహన వంటి అంశాలపై కూడా ఈ కమిటీలు పని చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు.
అలాగే విద్యాసంస్థలను కూడా బాధ్యులను చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు డీజీపీ వెల్లడించారు. అడ్మిషన్ ప్రక్రియలోనే ప్రత్యేక కాలమ్ చేర్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. డ్రగ్స్కు బానిసైన వారిని తిరిగి సాధారణ జీవితంలోకి తీసుకురావడానికి డీ అడిక్షన్ సెంటర్ల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 14 డీ అడిక్షన్ సెంటర్లు ఉన్నాయని, హైదరాబాద్లోనే 10, సైబరాబాద్ పరిధిలో మరో 4 సెంటర్లు అవసరమని చెప్పారు. అంతేకాకుండా ప్రతి జిల్లాలో కనీసం ఒక డీ అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోనున్నట్లు డీజీపీ సీ.వి. ఆనంద్ తెలిపారు.


