తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. మొన్నటి వరకు చల్లగా ఉన్న వాతావరణం. ఒక్కసారిగా మారిపోయింది. ఇరు రాష్ట్రాల్లో ఎండలు, వేడి గాలుల తీవ్రత పెరిగింది. జూన్ దగ్గర పడినా, నైరుతి ఇంకా పూర్తిస్థాయిలో ప్రవేశించలేదు. దాంతో తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. కొద్దిరోజులగా చిన్నపాటి వర్షంతో కాస్తా తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడింది. అయితే తిరిగి మరోసారి ఎండలు తమ ప్రతాపం చూపనున్నాయి. తెలంగాణ, ఏపీలో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగనున్నాయి.
తెలంగాణలో కొద్దిసేపు ఎండలు. అంతలోనే ఆకాశంలో మబ్బులు కనిపిస్తున్నాయి. రానున్న మూడు రోజులు పగటి పూట ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీల మేర పెరిగే అవకాశం ఉందని హైద రాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ, రేపు 40 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని హెచ్చరించింది. అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మెదక్, నిజామాబాద్, మహబూబ్ నగర్, సూర్యపేట, సంగా రెడ్డి, నల్లగొండ, తదితర జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరిగాయి. మరోవైపు ఏపీలోనూ మరో నాలుగు ఐదు రోజులు ఎండలు, వడగాలులు కొనసాగుతాయని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. రానున్న రెండు రోజులు మరింత జాగ్రత్తగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న మూడు రోజులు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, వడగాల్పుల ముప్పు పొంచి ఉందని వాతావరణశాఖ చెప్పింది. ఆంధ్రప్రదేశ్ లో మొన్నటి వరకు వర్షాలు పడి చల్లగా ఉన్న వాతావరణం ఇప్పుడు ఒక్కసారిగా మారింది. సోమవారం నుంచి ఎండలు, వేడి గాలుల తీవ్రత పెరిగిపోవడంతో ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతులు ఏకంగా 42 డిగ్రీలు దాటింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల సంస్థ సూచించింది. ఇక, నైరుతి రుతుపవ నాలు మూడు, నాలుగు రోజుల్లో కేరళలోకి ప్రవేశించనున్నాయి.