ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కలిశారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన డిప్యూటీ సీఎం.. పలు కీలక అంశాలపై దాదాపు గంట పాటు చర్చించారు. రేషన్ బియ్యం అక్రమ తరలింపు వ్యవహారం సంచలనంగా మారిన నేపథ్యంలో సీఎం చంద్రబాబుతో పవన్ కల్యాణ్ సుదీర్ఘంగా చర్చించారు. కాకినాడ సముద్రంలో స్టెల్లా ఫిప్పును సీజ్ చేయడం, కేంద్రప్రభుత్వానికి సంబంధించిన షిప్పును రాష్ట్ర ప్రభుత్వం ఎలా సీజ్ చేస్తుందంటూ ఓ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు సెటైర్లు వేస్తున్న విషయంపైనా చర్చించారు. అలాగే రాష్ట్రం నుంచి యదేచ్ఛగా రవాణా అవుతున్న గంజాయి, ఎర్రచందనం అంశంపైనా ఇద్దరి మధ్య చర్చ జరిగింది.
ఇక, సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్స్ పైనా చంద్రబాబుతో ప్రస్తావించారు పవన్ కల్యాణ్. అసభ్య పోస్టులపై కఠినంగా వ్యవహరించేలా పోలీసులకు ఆదేశాలివ్వాలని సీఎం చంద్రబాబును కోరారు. రాష్ట్రంలో నెలకొన్న వివిధ అంశాలపైనా చర్చించినట్లు సమాచారం. కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు స్వీకరిస్తున్న నేపథ్యంలో ఈ విషయంపైనా సీఎం చంద్రబాబుతో పవన్ చర్చించారు. ఇక అమరావతిలో జరగబోయే కేబినెట్ భేటీకి సంబంధించిన విషయంపైనా ఇద్దరి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధిపైనా చంద్రబాబు, పవన్ కల్యాణ్ మధ్య చర్చ జరిగినట్లు సమాచారం.