ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్రావు ఆరోపించారు. దేశ ఆర్థిక పరిస్థితులు, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ప్రధాని ప్రజలకు కొన్ని సూచనలు మాత్రమే చేశారని… కానీ వాటిని కాంగ్రెస్ వక్రీకరిస్తోందని మండిపడ్డారు.
ప్రజలు ఏది కొనొద్దని ప్రధాని మోదీ ఎక్కడా చెప్పలేదని రామచందర్రావు స్పష్టం చేశారు. ప్రజా రవాణా వ్యవస్థను ఎక్కువగా వినియోగించాలని, సోలార్ పవర్, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించాలని మాత్రమే ప్రధాని సూచించారని తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల కారణంగా ఆర్థిక ప్రభావం అన్ని దేశాలపై పడుతోందని చెప్పారు. అయినప్పటికీ భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలను అదుపులో ఉంచడంలో కేంద్ర ప్రభుత్వం విజయవంతమైందని పేర్కొన్నారు.
దేశ చరిత్రలో సంక్షోభ సమయాల్లో మాజీ ప్రధాన మంత్రులు కూడా ప్రజలకు పలు సూచనలు చేసిన విషయాన్ని రామచందర్రావు గుర్తు చేశారు. భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కాలంలో దక్షిణ భారతదేశంలో బియ్యం వినియోగం, ఉత్తర భారతదేశంలో చపాతీల వినియోగాన్ని తగ్గించాలని సూచించిన విషయాన్ని ప్రస్తావించారు.
అలాగే మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ఆహార కొరత సమయంలో ప్రజలు భోజనం తగ్గించాలని పిలుపునిచ్చారని చెప్పారు. అప్పట్లో దేశ ప్రయోజనాల కోసం ప్రజలు కూడా సహకరించారని గుర్తు చేశారు.
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 1967లో బంగారం కొనుగోళ్లు తగ్గించాలని ప్రజలకు సూచించిన విషయాన్ని కూడా రామచందర్రావు ప్రస్తావించారు.
అదేవిధంగా ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా సబ్సిడీలపై నియంత్రణ అవసరమని వ్యాఖ్యానించిన విషయాన్ని గుర్తుచేశారు. అంతర్జాతీయ యుద్ధాలు, ఆర్థిక ఒత్తిళ్లు భారత మార్కెట్పై ప్రభావం చూపుతున్నాయని… కొరియా యుద్ధ సమయంలో కూడా ధరలు పెరుగుతున్నాయని నెహ్రూ పేర్కొన్నారని రామచందర్రావు తెలిపారు.
అలాంటి సందర్భాల్లో దేశ ప్రజలకు అవగాహన కల్పించడం, పరిస్థితులకు అనుగుణంగా జీవనశైలిలో మార్పులు సూచించడం ప్రభుత్వ బాధ్యతేనని ఆయన అన్నారు.
ప్రస్తుతం ప్రధాని మోదీ కూడా ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సూచనలు చేస్తున్నారని… వాటిని కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా వాడుకోవడం సరైంది కాదని రామచందర్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు


