రైతు డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ రైతులను మోసం చేసిందని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆ పార్టీ ఆధ్వర్యంలో వరంగల్లో నిర్వహించిన రైతు సంగ్రామ సదస్సులో కేటీఆర్ కాంగ్రెస్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 60 ఏళ్ల పాటు రైతుల రక్తం తాగిన పార్టీ కాంగ్రెస్.. అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసిన కేటీఆర్…ఎన్నికల సమయంలో రైతులకు 34 హామీలు ఇచ్చి, ఇప్పటివరకు ఒక్కటి కూడా అమలు చేయలేదని విమర్శించారు.
వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పి…ఇప్పటికే 900 రోజులు గడిచిపోయాయని గుర్తుచేశారు. ఇదిలా ఉంటే… కాంగ్రెస్ నిర్వహించిన రైతు మేళాపై కూడా కేటీఆర్ విమర్శలు గుప్పించారు.అది రైతు మేళా కాదు… దగా మేళా అని వ్యాఖ్యానించారు. రైతు బంధు పథకం అమలుపై కూడా ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. కేసీఆర్ సభ ఉన్నప్పుడే రైతు బంధు డబ్బులు వేస్తున్నారని… దాన్ని రాహుల్ బంధుగా మార్చేశారని ఆరోపించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కూడా కేటీఆర్ ఘాటు విమర్శలు చేశారు. ఆయన రెగ్యులర్ సీఎం కాదు… రెన్యువల్ సీఎం అంటూ ఎద్దేవా చేశారు. ఇక రైతు రుణమాఫీ అంశంపై కేటీఆర్ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. ఏ గ్రామానికైనా వెళ్దాం… పూర్తి రుణమాఫీ జరిగిందని రైతులు చెబితే తాను రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. అయితే… తన సవాల్ను సీఎం రేవంత్ రెడ్డి లేదా మంత్రి తుమ్మల స్వీకరిస్తారా అని ప్రశ్నించారు. వరంగల్ను పోరాటాల గడ్డ… త్యాగాల గడ్డగా పేర్కొంటూ… రైతుల కోసం మరో ఉద్యమానికి సిద్ధమవుతున్నామన్నారు కేటీఆర్.


