హైదరాబాద్ నగరంలో వెలుగులోకి వచ్చిన రిచ్ కిడ్స్ ట్రాప్ కేసు.. పోలీసులు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో అర్జున్ , అతని సోదరుడు రాజీవ్ ప్రధాన నిందితులుగా గుర్తించారు. ఇప్పటివరకు బయటపడుతున్న వివరాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం,.. ఈ ముఠా ముఖ్యంగా ఆర్థికంగా బలమైన కుటుంబాలకు చెందిన మైనర్ బాలికలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాను ఆయుధంగా ఉపయోగించుకున్న నిందితులు, చాలా స్మార్ట్గా ఈ నేరాలను అమలు చేసినట్లు అధికారులు చెబుతున్నారు.
అర్జున్ తన స్నేహితులు హర్ష, జతిన్, శ్రీజిత్ల మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా అకౌంట్లను వినియోగించి బాలికలతో పరిచయం పెంచుకున్నట్లు గుర్తించారు. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ ద్వారా నకిలీ లేదా ఇతరుల పేర్లతో అకౌంట్లు నిర్వహిస్తూ, తన పేరు బయటకురాకుండా పకడ్బందీగా ప్లాన్ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
ఈ పరిచయాల ద్వారా మైనర్ బాలికలను నమ్మించి.. , వారి కుటుంబ పరిస్థితులను గమనించి, తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయాల్లో వారిని కలిసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ తర్వాత వారిని బెదిరించింది డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోంది.
ఇప్పటి వరకు సుమారు 25 మంది మైనర్ బాలికలు ఈ ముఠా బారిన పడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనల ద్వారా సుమారు రూ.40 లక్షలకు పైగా డబ్బులు వసూలు చేసినట్లు దర్యాప్తులో తేలింది.
పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం, అర్జున్ చాలా జాగ్రత్తగా తనపై నేరారోపణలు రాకుండా వ్యవహరించాడు. ఇతరుల ఫోన్లు, అకౌంట్లు వాడటం ద్వారా నేరానికి తనను దూరంగా ఉంచుకునే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.
ఈ కేసులో మరింత మంది బాధితులు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బాధితుల గోప్యతను కాపాడుతూ, మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు. నిందితులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.
పోలీసులు తల్లిదండ్రులకు, యువతకు ప్రత్యేక సూచనలు చేస్తున్నారు..
సోషల్ మీడియా పరిచయాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి
అనుమానాస్పద వ్యక్తులతో వ్యక్తిగత సమాచారం పంచుకోవద్దు
పిల్లల ఆన్లైన్ కార్యకలాపాలను పర్యవేక్షించాలి


