హైదరాబాద్లో మహిళల భద్రతపై దృష్టి పెట్టిన కొత్త పోలీస్ కమిషనర్ సుమతి, బాధ్యతలు చేపట్టిన మొదటి రోజే సంచలన నిర్ణయం తీసుకున్నారు. అధికారిక మీటింగ్స్కి పరిమితం కాకుండా, ప్రత్యక్షంగా ప్రజల మధ్యకి వెళ్లి పరిస్థితులు తెలుసుకోవాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే అర్ధరాత్రి దిల్సుఖ్ నగర్ బస్టాండ్లో ఆమె చేపట్టిన ఆపరేషన్ నగరంలో చర్చనీయాంశంగా మారింది.
అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఎలాంటి భద్రతా సిబ్బంది లేకుండా, సాధారణ మహిళలా బస్టాండ్కు చేరుకున్న సుమతి, అక్కడ బస్ కోసం వేచి ఉన్న ప్రయాణికురాలిలా నటించారు. కమిషనర్ అని ఎవరికి తెలియకుండా, ఒక సగటు మహిళగా నిలబడిన ఆమెకు అక్కడి వాస్తవ పరిస్థితులు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి.
కొద్ది సేపటికే అక్కడికి చేరుకున్న కొందరు యువకులు ఆమె చుట్టూ తిరుగుతూ అసభ్యంగా ప్రవర్తించడం ప్రారంభించారు. సంఖ్య క్రమంగా పెరిగి, దాదాపు 40 మంది వరకు ఆమె చుట్టూ చేరి వేధింపులకు పాల్పడ్డారు. వారిలో ఎక్కువ మంది విద్యార్థులే కాగా, మద్యం, గంజాయి మత్తులో ఉన్నట్లు సుమతి గమనించారు.
అర్ధరాత్రి 12 నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు కొనసాగిన ఈ ఆపరేషన్లో, సమీపంలో ఉన్న పెట్రోలింగ్ పోలీసులు మాత్రం అక్కడి పరిస్థితిని గమనించకపోవడం ఆందోళన కలిగించింది. ఈ సమయంలో సుమతి పట్ల పలువురు యువకులు అసభ్య ప్రశ్నలు అడిగినా, ఆమె మాత్రం అప్రమత్తంగా ఉండి ఒక్కొక్కరి ప్రవర్తనను గమనించారు.
మూడు గంటల తర్వాత అక్కడికి వచ్చిన బీట్ కానిస్టేబుల్ పరిస్థితిని గమనించగా, తర్వాత పోలీస్ బృందాలు రంగంలోకి దిగాయి. అయితే, ఈ ఒక్కరోజుతో ఆగకుండా, వరుసగా మూడు రోజుల పాటు అదే ప్రాంతంలో స్వయంగా నిఘా పెట్టిన సుమతి, సమస్య తీవ్రతను పూర్తిగా అర్థం చేసుకున్నారు.
దర్యాప్తు ఆధారంగా, బస్టాండ్ పరిసరాల్లో హాస్టల్స్ ఎక్కువగా ఉండటం వల్ల యువకులు రాత్రి వేళల్లో గుంపులుగా చేరి పోకిరి చేష్టలకు పాల్పడుతున్నారని గుర్తించారు. వెంటనే చర్యలు తీసుకున్న పోలీసులు, ఆ ప్రాంతంలో అల్లరి చేస్తున్న 40 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు.
వారిపై కేసులు నమోదు చేయడమే కాకుండా, కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. చదువుకోవాల్సిన వయసులో తప్పుదారి పడుతున్న యువతను సరిదిద్దేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
ఈ ఆపరేషన్ ద్వారా నగర భద్రతపై కీలక సందేశం ఇచ్చిన సుమతి, పోలీసింగ్ అంటే కేవలం కార్యాలయాల్లో కూర్చోవడం కాదు, ప్రజల మధ్యకి వెళ్లి వారి సమస్యలను అర్థం చేసుకోవడం.. అని స్పష్టం చేశారు.
మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, ఇలాంటి ఆపరేషన్లు కొనసాగిస్తామని ఆమె వెల్లడించారు. ఈ సంఘటన నగరంలో పోలీసుల పనితీరుపై చర్చకు దారితీస్తూ, భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరాన్ని చూపిస్తోంది.


