తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టీవీకే పార్టీ అధినేత విజయ్కు రాష్ట్ర గవర్నర్ నుంచి అధికారిక ఆహ్వానం అందింది. లోక్భవన్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం… ఈరోజు సాయంత్రం 4 గంటలకు విజయ్ గవర్నర్ను కలవనున్నారు.
ఎన్నికల్లో గెలుపు సాధించినప్పటికీ… ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118 సీట్లు టీవీకేకు దక్కలేదు. దీంతో… ఇతర పార్టీల మద్దతు కోసం విజయ్ ప్రయత్నాలు ప్రారంభించారు.
ఇప్పటికే… రెండు వారాల్లో మెజారిటీ నిరూపించుకునే అవకాశం ఇవ్వాలని గవర్నర్ను టీవీకే కోరినట్టు సమాచారం. అయితే… ఏ పార్టీతో కలుస్తుందన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.
ఇదిలా ఉంటే… టీవీకేకు కాంగ్రెస్ పార్టీ కీలక మద్దతు ప్రకటించింది. విజయ్ అభ్యర్థన మేరకు సీఎల్పీలో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నామని కాంగ్రెస్ తెలిపింది. మతతత్వ శక్తులను పార్టీలోకి చేర్చకూడదని షరతు విధించామని…ఆ షరతును విజయ్ అంగీకరించడంతో మద్దతు ప్రకటించినట్టు వెల్లడించింది.
పెరియార్, అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా తమ కూటమి పని చేస్తుందని కాంగ్రెస్ స్పష్టం చేసింది. తమిళ ప్రజలు లౌకిక, సంక్షేమ ప్రభుత్వానికే మద్దతు ఇచ్చారని పేర్కొంది. అలాగే… భవిష్యత్తులో లోక్సభ, రాజ్యసభ, స్థానిక ఎన్నికల్లో కూడా టీవీకేతో కలిసి ముందుకు సాగుతామని తెలిపింది.


