ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ పొత్తులపై రాజకీయ పార్టీలు చర్చలు జరుపుతున్నాయి. ఇప్పటికే టీడీపీ-జనసేన పార్టీ పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగగా.. తాజాగా పొత్తులపై చర్చించేందుకు కాంగ్రెస్, వామపక్ష పార్టీలు సమావే శమయ్యాయి. పీసీసీ చీఫ్ షర్మిలతో సీపీఐ, సీపీఎం నేతలు భేటీ అయ్యి.. పొత్తులు, సీట్ల సర్దుబాటుపై చర్చించారు. ప్రజా పోరాటాలను కలిసి చేయాలని నిర్ణయించారు.
పొత్తులకు సంబంధించి ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి వైసీపీ, టీడీపీలు బీటీంలు గా ఉన్నాయని ఆరోపించారు. వీరి అరాచకాలను అడ్డుకునేందుకు సీపీఎం, సీపీఐతో కలిసి కాంగ్రెస్ పని చేస్తుందని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై కలిసికట్టుగా పని చేస్తామన్నారు. బీజేపీ, వైసీపీని దెబ్బ కొట్టేలా పని చేస్తామన్నారు. పొత్తులపై తమ మధ్య చర్చ జరిగిందని.. ముందు ప్రజా సమస్యపై కలిసి వెళతామని తెలిపారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈనెల 26న ఏపీకి వస్తు న్నారని, ఆరోజు కూడా వామపక్ష పార్టీలు నేతలతో మరో సారి భేటీ అవుతామ న్నారు. భవిష్యత్తులో తప్ప కుండా కలిసి పని చేస్తామని, కలిసి పోటీ చేస్తామని స్పష్టం చేశారు. ఏపీకి ఇంత అన్యాయం చేసిన బీజేపీ, టీడీపీ, వైసీపీలను ఓడించాలన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రంలో మోడీ హామీ ఇచ్చి మాట తప్పారని మండిపడ్డారు. ఏపీకి కాంగ్రెస్ వల్లే న్యాయం జరుగుతుందని షర్మిల స్పష్టం చేశారు.