తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజు నుంచే జోసెఫ్ విజయ్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే రాజకీయ సంస్కృతిని మార్చాలని సంకేతాలు ఇస్తూ, ఉదయం మొదలుకొని రాత్రివరకు ఆయన తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది గంటల్లోనే విజయ్ ప్రభుత్వం తొలి పెద్ద నిర్ణయం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే తస్మాక్ మద్యం దుకాణాల్లో 717 షాపులను మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది.
ఇక మధ్యాహ్నానికి మరో కీలక నిర్ణయం ప్రకటించారు ముఖ్యమంత్రి విజయ్. తన పార్టీ తమిళ వెట్రి కళగం( Tamilaga Vettri Kazhagam) కార్యకర్తలకు కఠిన హెచ్చరిక జారీ చేశారు. ఇకపై ప్రజలకు ఇబ్బంది కలిగించేలా రోడ్లపై భారీ బ్యానర్లు, పోస్టర్లు, కటౌట్లు, పుట్టినరోజు వేడుకల పేరుతో ట్రాఫిక్కు ఆటంకం కలిగించే కార్యక్రమాలు పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు.
“తమిళగ వెట్రి కళగం పార్టీ ప్రజల సంక్షేమం కోసం మాత్రమే స్థాపించబడింది. ప్రజల విశ్వాసంతో గెలిచిన ముఖ్యమంత్రి మాకు గొప్ప బాధ్యత అప్పగించారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా బ్యానర్లు, వేడుకలు, పోస్టర్లు ఏర్పాటు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.” పార్టీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

తమిళనాడులో రాజకీయ నాయకుల భారీ కటౌట్లు, బ్యానర్లు, పోస్టర్లు సాధారణ దృశ్యమే. ముఖ్యంగా నాయకుల పుట్టినరోజులు, కుటుంబ కార్యక్రమాలు, రాజకీయ సమావేశాల సమయంలో నగరాలు మొత్తం పోస్టర్లతో నిండిపోతుంటాయి.
చాలాసార్లు ఇవి ట్రాఫిక్కు అంతరాయం కలిగించడమే కాకుండా ప్రమాదాలకు కూడా కారణమయ్యాయి. అంతేకాదు, ప్రజా స్థలాలను రాజకీయ ప్రచార వేదికలుగా మార్చేశారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో విజయ్ తీసుకున్న నిర్ణయం “కొత్త రాజకీయ సంస్కృతికి సంకేతం”గా కొందరు విశ్లేషిస్తున్నారు.
ఉదయం మద్యం దుకాణాలపై కీలక నిర్ణయం
మద్యం దుకాణాలు మూసివేయాలన్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. షాపులు పాఠశాలలు, దేవాలయాలు, ప్రార్థనా స్థలాలు, అలాగే బస్ స్టాండ్లకు 500 మీటర్ల పరిధిలో మద్యం షాపులు ఉండటంతో ప్రజల నుంచి చాలా కాలంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పుడు వాటిని రెండు వారాల్లో పూర్తిగా మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం తమిళనాడులో మొత్తం 4,765 తస్మాక్ మద్యం దుకాణాలు ఉన్నాయి. వాటిలో 276 షాపులు ప్రార్థనా స్థలాల సమీపంలో, 186 విద్యాసంస్థల దగ్గర, 255 బస్ స్టాండ్ల పక్కన ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ నిర్ణయం ముఖ్యంగా మహిళలు, తల్లిదండ్రులు, సామాజిక కార్యకర్తల నుంచి ప్రశంసలు అందుకుంటోంది.
ఇక రాజకీయ పరంగా చూస్తే, విజయ్ పార్టీ తొలి ఎన్నికలకే సంచలన విజయం సాధించింది. 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో ఆయన పార్టీ 108 సీట్లు గెలుచుకుంది. దాంతో దాదాపు 62 ఏళ్లుగా తమిళనాడు రాజకీయాలను ఆధిపత్యం చెలాయిస్తున్న DMK, AIADMK పార్టీలకు భారీ షాక్ తగిలింది. అయితే పూర్తి మెజారిటీకి కావాల్సిన 118 సీట్లు TVKకు రాలేదు. దీంతో కాంగ్రెస్, రెండు వామపక్ష పార్టీలు, అలాగే Viduthalai Chiruthaigal Katchi మద్దతు ప్రకటించాయి. ఈ నాలుగు పార్టీల మద్దతుతో విజయ్ ప్రభుత్వం మెజారిటీ మార్క్ను దాటింది. ఇప్పుడు అందరి దృష్టి బుధవారం జరగనున్న విశ్వాస పరీక్షపై ఉంది.


